మెదక్ అర్బన్, డిసెంబర్ 8 : మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పిలుపునిచ్చారు. గురువారం పోలీసులు ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో ‘లింగ వివక్షత లేని సమాజం కోసం జాతీయ ఉద్యమం’ అనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులతో జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా నుంచి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆడపిల్లలు అనగానే చిన్నచూపు చూడొద్దన్నారు. తల్లిదండ్రులు మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలకు స్వేచ్ఛను ఇవ్వాలని, వారితో సమానంగా చదివించాలని సూచించారు. అప్పుడే ఆడపిల్లలు మగ పిల్లలతో సమానంగా దూసుకుపోతారన్నారు.
ఒక మహిళ చదువుకొని ఉంటే తన పిల్లలకు సమాజంపై అవగాహన కల్పించే అవకాశం ఉంటుందన్నారు. పిల్లలకు సమాజంలో జరుగుతున్న మంచిచెడుపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ఉండాలని సూచించారు. కుటుంబ ఆర్థిక భారాన్ని నేడు స్త్రీ శక్తి భరి స్తుందని తెలిపారు. ఉన్నత శిఖరాలను చేరుకుని పురుషులకు సమానంగా రాణిస్తున్నట్లు తెలిపారు. మహిళల సాధికారత .. జాతి సాధికారతగా పేర్కొన్నారు. కుటుంబానికి, సమాజానికి, దేశాభివృద్ధ్దికి మహిళల కృషి చాలా అవసరం అన్నారు. మహిళల రక్షణకు ప్రభుత్వం అనేక చట్టాలను అమలు చేస్తుం దన్నారు. మహిళలకు అవగాహన కల్పించడానికే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. అక్రమ రవాణా, లైంగిక నేరాలు, గృహ హింస, బాల్య నేరాలు, ఎన్ఆర్ఐ సమస్యలు, సైబర్ నేరాలను తక్షణమే పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, బాధితులకు పోలీసులు అందుబాటులో ఉండి భరోసా కల్పిస్తారన్నారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ సైదులు, మెదక్ పట్టణ సీఐ మధు, ఎస్బీఐఐ నవీన్బాబు పాల్గొన్నారు.