మెదక్, జూలై 21 (నమస్తే తెలంగాణ): జిల్లా కేంద్రం మెదక్లో దశాబ్దాల ఎదురుచూస్తున్న రైల్వే లైన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు రెండు చోట్ల రైల్వే రేక్ పాయింట్లకు సెంట్రల్ ఫర్టిలైజర్స్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి లభించింది. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఆరు నెలల్లో రూ.50 కోట్లు మంజూరు కావడంతో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం కలిగింది. మెదక్ ప్రాంతవాసులకు రైలు సౌకర్యం అందుబాటులోకి రానుండడంతో జిల్లా ప్రజలు దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు సౌకర్యవంతంగా మారనున్నది. రేక్ పాయింట్తో మెదక్, సిద్దిపేట జిల్లాలతో పాటు పొరుగు జిల్లాలకు చెందిన రైతులు, వ్యాపారులకు ప్రయోజనం కలగనున్నది. ఎరువులు, పీడీఎస్ రైస్, పత్తి, సిమెంట్, స్టీల్ తదితర సామాగ్రి ఎగుమతి, దిగుమతి చేసుకునేందుకు సౌకర్యవంతంగానూ, సులభతరంగా అయ్యింది. రైల్వే స్టేషన్లో గూడ్స్ రైళ్ల రాకపోకలకు వీలుగా ప్రత్యేక ట్రాక్లు నిర్మించగా, సరుకుల నిల్వలకు అనుగుణంగా ఆయా చోట్ల గోడౌన్లు నిర్మించనున్నారు. ఈ మేరకు రేక్ పాయింట్తో సరుకుల దిగుమతి, ఎగుమతి భారీ మొత్తంలో జరుగనున్నది. దీంతో వేలాది మంది కూలీలకు ఉపాధి లభించనున్నది. మెదక్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, గోపాల్పేట, ఎల్లారెడ్డి నియోజకవర్గాల ప్రజలకు రైల్వే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
అక్కన్నపేట నుంచి మెదక్కు..
సికింద్రాబాద్- నిజామాబాద్ రూట్లలోని రామాయంపేట మండలం అక్కన్నపేట దగ్గర నుంచి మెదక్ పట్టణం వరకు 17.20 కిలోమీటర్ల దూరం రైల్వేలైన్ నిర్మాణం పూర్తయ్యింది. ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే అధికారులు గూడ్స్, ప్యాసింజర్ రైళ్లతో ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. దీంతో త్వరలో ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంతో పాటు మంత్రి హరీశ్రావు ప్రత్యేక కృషితో మెదక్లో రైల్వే రేక్ పాయింట్ ఏర్పాటుకు ఆమోదం లభించింది. కొద్ది రోజుల్లో మెదక్లో రేక్ పాయింట్ ఏర్పాటు కానున్నది. మెదక్ రైల్వే స్టేషన్కు సంబంధించి వసతులు, ట్రాక్లను ఇటీవల దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ శరత్ చంద్రయాన్ అక్కన్నపేట స్టేషన్ నుంచి మెదక్ స్టేషన్ వరకు ట్రాక్ పరిశీలించారు. దీంతో పాటు మెదక్ జిల్లా కలెక్టరేట్లో సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లు, వ్యాపారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు.మెదక్ జిల్లా నుంచి ప్రతి యేటా 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం హైదరాబాద్లోని సనత్నగర్లో ఉన్న ఎఫ్సీఐ గోదాములకు లారీలతో తరలించేందుకు ఇబ్బందులు కలిగేవి. ప్రస్తుతం రేక్ పాయింట్ అందుబాటులోకి రానుండడంతో రైళ్లతో సులభంగా బియ్యం రవాణా చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని కంపెనీల నుంచి ఎరువులను గూడ్స్ రైళ్లతో మెదక్కు దిగుమతి చేసుకోవచ్చు. సిమెంట్, స్టీల్, ట్రాన్స్పోర్టేషన్, ఈ ప్రాంతంలో రైతులు పండించే పత్తి తదితర పంటలను ఎగుమతి చేసేందుకు సులభతరంగా ఉంటుంది. మెదక్లో రైల్వే రేక్ పాయింట్ ఏర్పాటు కానుండగా అందుకు అనుగుణంగా సరుకుల నిల్వ కోసం గోడౌన్ల నిర్మాణం చేపట్టనున్నట్లు కలెక్టర్ హరీశ్ తెలిపారు. దీనికి 30 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించామని, త్వరలో పౌర సరఫరాల శాఖ అప్పగిస్తామని పేర్కొన్నారు.
వేలాది మందికి ఉపాధి అవకాశాలు..
రైల్వే రేక్ పాయింట్ల ఏర్పాటుతో రైస్ మిల్లర్లు, వ్యాపారులు, రైతులకు ఎంతో ఉపయోగం కలగనున్నది. దీంతో పాటు ఎగుమతి, దిగుమతితో వేలాది మంది కూలీలకు ఉపాధి లభించనున్నది. మెదక్లో రేక్ పాయింట్కు దూర ప్రాంతాల నుంచి గూడ్స్ రైళ్లతో వచ్చే సరుకులను అన్లోడ్ చేసేందుకు, ఎగుమతి చేసే సమయంలో గూడ్స్ బోగీల్లో నింపేందుకు స్థానిక కూలీలకు పని దొరకనున్నది.
మంత్రి హరీశ్రావు చొరవతో రూ.50 కోట్లు మంజూరు
మెదక్- అక్కన్నపేట రైల్వే లైన్, రైల్వే స్టేషన్ల పనుల నిర్మాణానికి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవ తీసుకుని గడిచిన ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.50 కోట్లు మంజూరు చేయించారు. దీంతో పనులన్నీ పూర్తయి కొత్త రైల్వే స్టేషన్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి.
రేక్ పాయింట్ను సందర్శించిన వ్యవసాయశాఖ, మార్క్ఫెడ్ అధికారులు
మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ, హెచ్అండ్టీ కాంట్రాక్టర్ రైల్వేశాఖతో కలసి మెదక్లోని రేక్ పాయింట్ను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా రైల్వేప్లాట్ఫాం, లారీ వెళ్లేందుకు రోడ్లను చూశారు. రేక్ పాయింట్కు ఎలాంటి సమస్య లేకుండా స్టాక్ అన్లోడ్ చేయవచ్చన్నారు. గోడౌన్లకు సంబంధించి వ్యవసాయశాఖ అధికారులు, ఏఎంసీ, మెదక్ వద్ద సుమారు వెయ్యి మీటర్ల స్థలాన్ని గుర్తించవచ్చని తెలిపారు. సమీపంలోని ఏఎంసీతో పాటు ప్రైవేట్ డీలర్లతో స్థలాన్ని గుర్తించాలని మార్క్ఫెడ్ డీఎం, హెచ్అండ్టీ కాంట్రాక్టర్లకు తెలిపారు. రెండుమూడు రోజుల్లో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తామన్నారు.