రామగిరి, ఆగస్టు 15 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లోకి పోలీసులు బలవంతంగా ప్రవేశించి, నాయకులపై దాడి చేసి అరెస్టు చేయడాన్ని సీపీఎం, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు తీవ్రంగా ఖండించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రోజునే ప్రజా సంఘాల కార్యాలయంపై పోలీసులు ఈ విధంగా దాడి చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. సీపీఎం నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, మహమ్మద్ సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, దండంపెల్లి సత్తయ్య, అవుట రవీందర్, బొల్లు రవీందర్తో పాటు డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేశ్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని గుర్రంపూడ్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
దీనిపై సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ హాశమ్, మండల కార్యదర్శి నలపరాజు సైదులు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకుంటున్న దేశంలో, స్వాతంత్ర్య దినోత్సవం రోజునే పోలీసులే కార్యాలయాలపై దాడి చేసి నాయకులపై చేయి చేసుకోవడం సిగ్గుచేటన్నారు. నార్కట్పల్లి ఎస్ఐ విష్ణు వ్యవహారశైలి సరిగ్గా లేదని, ప్రజా నాయకుల పట్ల సంయమనంతో, జవాబుదారీతనంగా వ్యవహరించాలని హెచ్చరించారు.
డీవైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి గుండాల నరేష్, మండల కార్యదర్శి కండే యాదగిరి, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి మరుపాక కిరణ్ మాట్లాడుతూ.. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే గుండాల మాదిరిగా వ్యవహరించడం దారుణమన్నారు. పోలీసులను చూస్తే ప్రజలు అసహ్యించుకునేలా అధికారులు ప్రవర్తించడం మానుకోవాలని హితవు పలికారు. అక్రమంగా అరెస్టు చేసిన సీపీఎం, డీవైఎఫ్ఐ నాయకులందరినీ వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న పోలీసుల తీరుపై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.