జిల్లా అంతటా తేలికపాటి వాన
జిల్లా సరాసరి 7.5 మి.మీ వర్షపాతం నమోదు
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు
కొనసాగుతున్న వరినాట్లు, పత్తి కలుపుతీత పనులు
జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి వాతావరణం మేఘావృత్తమై ఉంది. ముసురు అలుముకుంది. జిల్లా సరాసరి 7.5 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ములుగు మండలంలో 38మి.మీ వర్షం పడింది. అత్యల్పంగా కోహె డ, కొమురవెల్లి మండలాల్లో 1.8 మి.మీ. వర్షం కురిసింది. వాతావరణం సాగుకు అనుకూలంగా మారడంతో వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు.
సిద్దిపేట, జూలై 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో వ్యవసాయ సాగు పనులు ముమ్మరమయ్యాయి. అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. కొందరు రైతులు వరి నాట్లు వేసే పనిలో ఉండగా, ఇంకొందరు పత్తి కలుపుతీత, పంట చేల్లకు మందులు వేసేపనిలో బిజీ అయ్యారు. ఈ యేడాది జిల్లాలో పత్తి ఎక్కువగా సాగు చేస్తున్నారు. అధిక సాంద్రత పద్ధతిలో సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. త్వరలోనే వ్యవసాయ శాఖ అధ్వర్యంలో పంట సాగు వివరాలు నమోదు చేయడానికి సమాయత్తమవుతున్నారు. ఏ రైతు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? ఏయే పంటలు వేశారు? అనే లెక్కలు ఈ నెలాఖరు వరకు తేల్చనున్నారు. పదిరోజుల నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగు పనులు ముమ్మరమయ్యాయి.
రైతన్న తీరిక లేకుండా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రప్రభుత్వం రైతుబంధును రైతుల ఖాతాలో జమ చేస్తున్నది. ఎకరాల వారీగా డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి. ప్రధానంగా రైతులు డిమాండ్ ఉన్న పంటలను రైతులు సాగు చేశారు. ప్రధానంగా పత్తి, కందులు, వరి పంటలు వేశారు. సిద్దిపేట జిల్లాలో ఈ యేడాది ఎక్కువగా ఆయిల్పామ్ సాగును రైతులు చేస్తున్నారు. నంగునూరు మండలం నర్మెటలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ఆ దిశగా రైతులు సాగుకు ముందుకు వస్తున్నారు. ఆయా మండల కేంద్రాలతోపాటుగా ప్రధాన గ్రామాల్లో అధికారులు ఎరువులు సిద్ధంగా ఉంచారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా మండల శాఖ ఏవోలు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రస్తు తం కురుస్తున్న వర్షాలు ఆరుతడి పంటలకు ఎంతో ప్రయోజనం కలిగించాయి అని చెప్పవచ్చు.
జిల్లా వ్యాప్తంగా 7.5 మి.మీ వర్షపాతం
సిద్దిపేట అర్బన్, జూలై 8 : జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలో 7.5 మి.మీ సరాసరి నమోదైంది. అత్యధికంగా ములుగు మండలంలో 38.0 మి.మీ వర్షం పడింది. జిల్లాలోని మండలాల్లో దుబ్బాక 3 మి.మీ, సిద్దిపేట రూరల్ 1.5 మి.మీ, చిన్నకోడూరు 8.9 మి.మీ, బెజ్జంకి 16.5 మి.మీ, కోహెడ 1.8 మి.మీ, నంగునూరు 1.6 మి.మీ, తొగుట 10.4 మి.మీ, మిరుదొడ్డి 7.1 మి.మీ, దౌల్తాబాద్ 13.4 మి.మీ, రాయపోల్ 10.2 మి.మీ, వర్గల్ 17.5 మి.మీ, మర్కూక్ 9 మి.మీ, జగదేవ్పూర్ 6.5 మి.మీ, గజ్వేల్ 8.3 మి.మీ, కొండపాక 6.9 మి.మీ, కొమురవెల్లి 1.8 మి.మీ, చేర్యాల 3.4 మి.మీ, నారాయణరావుపేట 2.5మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో మొత్తం వర్షపాతం 180.5 మి.మీలుగా నమోదు కాగా, జిల్లా సరాసరి వర్షపాతం 7.5 మి.మీగా నమోదైంది.