జోరువానలతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో నల్లవాగు, నారింజ ప్రాజెక్టుల్లోకి వరద కొనసాగుతున్నది. సింగూరు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు ఉండగా, శనివారానికి 20.794కు చేరింది. మొత్తం 1374 చెరువుల్లో 112 అలుగు పారుతున్నాయి. 77 పూర్తిగా నిండగా, 419 చెరువుల్లోకి 50 శాతం నీళ్లు చేరాయి. వర్షాలతో 743 ఎకరాల్లో పంటలు మునిగినప్పటికీ రైతులు అప్రమత్తమై నీటిని బయటికి వదలడంతో భారీ పంటనష్టం తప్పింది. పది ఇండ్లు పూర్తిగా, 210 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల రోడ్లు, కల్వర్టులు ధ్వంసమవడంతో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు మరమ్మతులకు చర్యలు తీసుకుంటున్నారు.
మెదక్ జిల్లాలో ఘనపూర్కి 2.75 టీఎంసీలు, పోచారానికి 1.82 టీఎంసీల, హల్దీవాగు ప్రాజెక్టులోకి 10వేల క్యూసెక్కుల నీరు వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 82శాతం అధిక వర్షపాతం నమోదైంది. శనివారం వాన తగ్గుముఖం పట్టడంతో జనజీవనం సాధారణ స్థితికి చేరుకున్నది. ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేలా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు వరదముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.
మెదక్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నీటి వనరులన్నీ జలకళను సంతరించుకున్నాయి. వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులైన ఘణాపూర్, పోచారం, హల్దీవాగుతోపాటు చెరువులు, కుంటలు, చెక్డ్యాంలు కళకళలాడుతున్నాయి. జిల్లాలోని ఘనపూర్ ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వస్తున్నది. అంతేకాకుండా పోచారం ప్రాజెక్టు కూడా పొంగి పొర్లున్నది. దీంతో రైతులు వానకాలం వరి సాగు పనులు ముమ్మరం చేశారు. గత పదిహేను రోజులుగా నాట్లు వేసేందుకు వెనుకడుగు వేసిన రైతులు ప్రస్తుతం వర్షంలోనూ నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు.
82 శాతం అధిక వర్షపాతం
మెదక్ జిల్లాలోని 21 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైందని ప్రణాళిక శాఖ అధికారులు తెలిపారు. వర్షాకాలం మొదలైన తర్వాత జూన్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూలై మొదటివారంలో వానలు కురవలేదు. రెండోవారం నుంచి వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా 82శాతం అధిక వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లాలోని మెదక్, హవేళీఘనపూర్, రామాయంపేట, నిజాంపేట్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, వెల్దుర్తి మండలాల్లో పంట పొలాల్లోకి పెద్దఎత్తున వరద చేరింది. జిల్లా కేంద్రంలోని బంగ్లా చెరువు వద్ద మత్స్యకారులు పెద్దఎత్తున చేపలు పడుతున్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలి
మెదక్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. భారీ వర్షాల పడుతున్న నేపథ్యంలో చెరువు కట్టలు తెగే అవకాశం ఉన్నందున ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షిస్తున్నారు. మెదక్ నియోజకవర్గంలో ఎక్కడ సమస్య ఉన్నా తక్షణమే స్పందిస్తూ పాలకవర్గం, ప్రజాప్రతినిధులు తిరుగుతూ సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు.
‘ఘనపూర్’లోకి భారీగా వరద
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లాలోని ఘనపూర్ ప్రాజెక్టులోకి 2.75 టీఎంసీల నీరు వచ్చింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 0.135 టీఎంసీలు (462.775 మీటర్లు). ఘనపూర్ ప్రాజెక్టులోకి భారీగా వరద రావడంతో ఏడుపాయల వనదుర్గా ప్రాజెక్టు ముందు నుంచి ప్రవహిస్తున్నది. దీని కింద మహబూబ్నహర్, ఫత్తేనహర్ కెనాళ్ల ద్వారా ఆయా మండలాల పరిధిలోని గ్రామాలకు నీరు అందుతుండడంతో రైతులు వరి నాట్లు వేసుకునే పనిలో పడ్డారు. ఇదిలావుండగా మెదక్-కామారెడ్డి సరిహద్దులోని పోచారం ప్రాజెక్టు 464 ఫీట్లు ఉండగా, 1.82 టీఎంసీల నీరు వచ్చి చేరింది. 7,477 క్యూసెకుల మేర ఇన్ఫ్లో ఉంది. వెల్దుర్తి సమీపంలోని హల్దీవాగు నిండి మెదక్ మండలంలోని బొల్లారం మత్తడి పొంగుతున్నది. 10వేల క్యూసెకుల నీరు ఇన్ఫ్లో వస్తున్నది. జిల్లాలో 34 చెక్డ్యాంల్లో వరద చేరి పొంగుతున్నాయి. మంజీర, హల్దీ వాగులపై నిర్మించిన చెక్డ్యాంలు జలకళను సంతరించుకుంటున్నాయి. జిల్లాలో 2,275 చెరవులు, కుంటలు ఉండగా ఇప్పటికే 825 చెరువులు అలుగులు పారుతున్నాయి. మరిన్ని చెరువులు అలుగులు పారడానికి సిద్ధంగా ఉన్నాయి. 1,115 చెరువులు 75-100శాతం నిండగా, 335 చెరువులు 50-75శాతం నిండాయి. మిగతా చెరువులు కొంత నీరు వచ్చి చేరిందని ఇరిగేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు.
అలుగులు పారుతున్న చెరువులు, కుంటలు
జిల్లాలోని చిన్ననీటి వనరులు జలకళను సంతరించుకున్నాయి. వర్షాలతో జిల్లాలో చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి. జిల్లాలో 1374 చెరువులు ఉండగా 112 చెరువులు అలుగు పారుతున్నాయి. సంగారెడ్డి ఇరిగేషన్ డివిజన్ పరిధిలో 97, జహీరాబాద్ డివిజన్ పరిధిలో 10, నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో ఐదు చెరువులు అలుగు పారుతున్నాయి. జిల్లాలో 77 చెరువులు పూర్తిగా నిండగా 563 చెరువుల్లోకి 75శాతం నీళ్లు వచ్చాయి. 419 చెరువుల్లోకి 50శాతం నీళ్లు చేరాయి. చెరువులు, వాగులు అలుగు పారుతుండడంతో మత్స్యకారులు జోరుగా చేపలు పడుతున్నారు. ఐదు నుంచి పది కిలోల చేపల వరకు మత్స్యకారుల వలలో చిక్కుతున్నాయి. మత్స్యసంపద పెరగటంతో మత్స్యకారులు సంతోషంగా ఉన్నారు. అధిక వర్షాలు కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ, వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.