చేర్యాల, అక్టోబర్ 17: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి రోజురోజు భక్తుల రద్దీ పెరిగిపోతోంది. ఉత్సవాల సమయంలో మల్లన్న దర్శనానికి 4 నుంచి 8 గంటల సమయం పడుతున్నది. ఈ క్రమంలో వేకువజామునే క్యూలోకి ప్రవేశించిన భక్తుడికి ఉదయం 9గంటల తర్వాతే స్వామి వారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో క్యూలో ఉన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల సమస్యను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆదేశాల మేరకు ఆలయ చైర్మన్ గీస భిక్షపతి కొత్త క్యూలైన్ల నిర్మాణానికి ఏకగ్రీవ తీర్మానం చేసి అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించి ముందుకు కొనసాగుతుండడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
షిర్డీ, విజయవాడ ఆలయాల తరహాలో…
షిర్డీ, విజయవాడ ఆలయాల్లో ఉన్న విధంగా కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో ఆలయ నిధులు రూ.12కోట్లతో క్యూలైన్లు నిర్మించాలని ఆలయ అధికారులతోపాటు ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకున్నది. ఆలయ చైర్మన్, అధికారులు, సిబ్బంది క్యూలైన్లు నిర్మించాలనుకునే స్థలాన్ని ప్రతిపాదించారు. ఇటీవల రాష్ట్ర దేవాదాయశాఖ ఎస్ఈ, ఈఈ, వాస్తు కోసం స్తపతి మల్లన్న క్షేత్రంలో పర్యటించి స్థలాన్ని పరిశీలించి కొలతలు సైతం తీసుకున్నారు. ఇంజినీరింగ్ అధికారులు అనుమతి ఇవ్వగానే పనులు చేసేందుకు ఆలయ అధికారులు టెండర్ల ప్రక్రియ ప్రారంభించనున్నారు. క్యూలో ఒక్కో గది, గదిలో తాగు నీటి వసతి, టాయిలెట్స్ నిర్మాణాలు, ఏసీలతో పాటు స్నాక్స్ విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొత్త క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు సంబంధించి ప్రైవేట్ వ్యక్తులు కోల్పోతున్న స్థలానికి స్థలంతో పాటు భవన నిర్మాణానికి ప్రభుత్వ అధికారుల ప్రతిపాదనల మేరకు 11 మందికి రూ.78లక్షల46వేల547 చెక్కులను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అందజేశారు. మల్లన్న క్షేత్రంలో భక్తులకు మరిన్ని వసతులు కల్పించేందుకు ఆలయవర్గాలు ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. కొత్త క్యూ లైన్ల నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు సేకరించిన స్థలం లో ఉన్న పాత భవనాల తొలగింపు పనులను సైతం పూర్తి చేశారు. కొత్త క్యూలైన్ల నిర్మాణం వల్ల ఆలయానికి ఖర్చులు సైతం తగ్గనున్నాయి.ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుండడంతో చలువ పందిర్ల ఏర్పాటు కోసం లక్షల్లో ఖర్చు అయ్యేది. శాశ్వత ప్రాతిపదికన క్యూకాంప్లెక్స్ నిర్మాణం కానుండడంతో ఖర్చులతో పాటు భక్తులకు మంచి వసతి ఏర్పడనున్నది.
ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ఆలయ ధర్మకర్తల మండలి చర్యలు తీసుకుంటున్నది. మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రత్యేక శ్రద్ధతో కొమురవెల్లి మల్లన్న క్షేత్రం అభివృద్ధి చెందడంతో పాటు భక్తులకు వసతులు సమకూరుతున్నాయి. కొత్తగా క్యూలైన్లు నిర్మించడం వల్ల భక్తులకు ఎంతో ప్రయోజనం చేకూరనున్నది.క్యూలో భక్తులు వేచి ఉండడం వల్ల వారికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అన్ని వసతులు కల్పించే విధంగా ప్రణాళిక రూపొందించాం. భక్తులకు వసతులు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం.
– గీస భిక్షపతి, ధర్మకర్తల మండలి చైర్మన్ జైకొడుతున్న ప్రజలు