కల్హేర్/ సిర్గాపూర్, ఫిబ్రవరి 2 : గత పాలకులు మాయ మాటలతో మభ్యపెట్టి గద్దెనెక్కిన తర్వాత అభివృద్ధిని విస్మరించారని విమర్శిస్తూ, సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన ఆలోచనలతో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. గురువారం కల్హేర్ మండల పరిధిలోని కృష్ణాపూర్లో ‘మన ఊరు-మన బడి’లో భాగంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ. 19.84 లక్షలతో చేపట్టిన పున:నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, ఉపాధ్యాయుల కొరతతో పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. పేదలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పాఠశాలల్లో మెరుగైన వసతులను కల్పించేందుకు సీఎం కేసీఆర్ ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. కోట్లాది నిధులు వెచ్చించి ఆధునీకరిస్తున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కృష్ణాపూర్లో గత పాలనలోని పాలకులు 200 మీటర్ల సీసీ రోడ్డు వేస్తే, బీఆర్ఎస్ పాలనలో రూ.కోటి నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు.
మీ అదరణతో నియోజకవర్గం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతితో పాటు అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. మండలంలోని అన్ని పాఠశాలల్లో కంటే పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేసిన హెచ్ఎం సుదర్శన్ను ఎమ్మెల్యే అభినందించారు. డీపీవో సురేశ్ మోహన్ మాట్లాడుతూ గతంలో పాఠశాలల్లో అన్ని వసతులు ఉండేవి కావని సీఎం కేసీఆర్ పాలనలో కోట్లాది నిధులు ఖర్చుచేసి సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. పిల్లలకు నాణ్యమైన విద్య ను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నర్సింహరెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్, మండలాధ్యక్షుడు రాంసింగ్, పీఆర్ ఈఈ అంజయ్య, జిల్లా, మండల కో- ఆప్షన్ సభ్యులు అలీ, ఘని, సర్పంచ్లు కిష్టారెడ్డి, శ్రావణ్ కుమార్, ఎంపీడీవో సంగ్రామ్, ఎంఈవో శంకర్, పీఏసీఎఎస్ వైస్ చైర్మన్ రాంరెడ్డి, ఏవో శశాంక్, నాయకులు అంజిరెడ్డి, గోపాల్రెడ్డి, వెంకటేశం, శ్రీనివాస్గౌడ్, పండరి, పాఠశాలల చైర్మన్లు హన్మాండ్లు, పోషయ్య, ఉపాధ్యాయులు ఉన్నారు.
సరికొత్త రూపుతో సర్కారు బడుల స్వరూపాన్ని మార్చి విద్యను మెరుగు పర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. సిర్గాపూర్ మండలంలోని కడ్పల్ ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు- మన బడి’లో రూ. 23 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎంపీపీ మహిపాల్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అంతకుముందు ఎమ్మెల్యేకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సరస్వతీమాత చిత్ర పటానికి ప్రత్యేక పూజలు చేశారు. తరగతి గదుల్లో కొత్తగా ఏర్పాటు చేసి బోర్డులు, అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే మొక్క నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో ఎంపీపీ జార మహిపాల్రెడ్డి, సర్పంచ్ సంజీవరెడ్డి, ఎంఈవో శంకర్, హెచ్ఎం భూమయ్య, యశ్వంత్, ఎస్సై నారాయణ, ఎస్ఎంసీ కమిటీ సభ్యులు ఉన్నారు.