వాణిజ్య పంటలను ప్రోత్సహించి రైతులను ఆర్థికంగా ఎదిగేలా చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పుకొనే పాలకులు, అధికారులు కేవలం మాటలకే పరిమితమవుతున్నారు. ప్రోత్సాహం దేవుడెరుగు గానీ పండించిన పంటలు కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడం శోచనీయం. ఆరుగాలం కష్టపడి పనిచేసి పండించిన పంటను మార్కెట్కు తీసుకొస్తే కొనుగోళ్లు చేయకుండా రోజుల తరబడి పడిగాపులు కాసేలా చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పొద్దుతిరుగుడు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. మార్కెట్కు తెచ్చిన సన్ఫ్లవర్ పంటను నెల రోజులైనా కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
హుస్నాబాద్, మే 5: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్చి 21వ తేదీన పొద్దుతిరుగుడు పంట కొనుగోలు కేంద్రాన్ని అధికారులు ఆర్భాటంగా ప్రారంభించారు. ఇప్పటికి నెల 15 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు పూర్తి కాలేదు. మొదట్లో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నాక్ఫెడ్ వారు పంటకొనుగోలు చేయగా స్థానిక ప్యాక్స్ ఆధ్వర్యంలో 52 మంది రైతులకు చెందిన కేవలం 547 క్వింటాళ్లు మాత్రమే కొన్నారు. ఇంకా మార్కెట్ యార్డులో సుమారు వెయ్యి క్వింటాళ్ల పొద్దుతిరుగుడు పంటరాసులు ఉన్నాయి. పదిహేను రోజులుగా కొనుగోళ్లు లేకపోవడంతో పంటకుప్పలపై టార్పాలిన్లు వేసి ఉంచారు. టార్పాలిన్లు తీసింది లేదు… కాంటా లు పెట్టింది లేదు. నిత్యం రైతులు వచ్చి నిరాశతో తిరిగి వెళ్లిపోతున్నారు. అధికారులను అడిగితే ప్రభు త్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతనే కొంటామని సమాధానిమిస్తున్నారు.
పట్టించుకునేవారు కరువు
మార్కెట్ యార్డులో రాత్రి వేళల్లో సన్ఫ్లవర్ పంట చోరీకి గురవుతున్నదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీదైన పంట కావడంతో నిత్యం యార్డులో పోసి ఉన్న రాసుల నుంచి బస్తాల్లో ద్విచక్రవాహనాలపై తరలిస్తున్నట్లు వారు చెప్తున్నారు. రోజుల తరబడి టార్పాలిన్లు కప్పి ఉంచడంతో ఇదే అదనుగా భావించిన దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. ముందు రోజు ఉన్నట్లు తెల్లవారే సరికి కుప్పల్లో కొంత భాగం తీసుకెళ్లినట్లు కనిపిస్తున్నదని, ఈ విషయంపై అధికారులకు చెబితే అలాంటిదేమీ జరగదనే నిర్లక్ష్య సమాధానం చెప్తున్నారని రైతులు వాపోతున్నారు. మార్కెట్లో పోసుకున్న పంటకు రక్షణ కల్పించాలని రైతులు కోరుతున్నారు.
15 రోజులుగా కొనుగోళ్లు బంద్
రెండెకరాల్లో పొద్దుతిరుగుడు పంట సాగుచేశా. దాదాపు 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. కోహెడ మండలం నుంచి ఇక్కడికి తెచ్చి పది రోజులు దాటింది. ఇప్పటి వరకు పంటను కొంటలేరు. అధికారులను అడిగితే రేపు మాపు అంటూ దాటవేస్తున్నారు. బయట అమ్ముకుందామంటే దళారులు తక్కువ ధరకు అడుగుతున్నారు. ఇక్కడ క్వింటాల్కు రూ. 7,721 మద్దతు ధర వస్తదని వస్తే రోజుల తరబడి ఇక్కడే పడిగాపులు కాయాల్సి వస్తుంది. దొంగల భయం కూడా ఉంది. అధికారులు స్పందించి వెంటనే కొనుగోళ్లు చేపట్టాలి.
– చిన్నబట్టు రాజిరెడ్డి, రైతు, కోహెడ మండలం (సిద్దిపేట జిల్లా)