అందోల్, ఆగస్టు 26: అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్- బీజేపీల నుంచి పెద్దఎతున్న బీఆర్ఎస్లో చేరుతున్నారని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శనివారం అందోల్లోని క్యాంపు కార్యాలయంలో పుల్కల్ మండలం మంతూ ర్, రాయికోడ్ మండలం మాందాపూర్, టేక్మాల్ మండలం షాబాద్ తండాకు చెందిన కాంగ్రెస్ నాయకులు, వార్డుమెంబర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు.
ఎమ్మెల్యే వారికి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు సముచిత స్థానం దక్కుతుందన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నంబర్వన్ స్థానంలో ఉన్నదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదన్నారు. అందోల్ గడ్డపై మళ్లీ ఎగిరేది గులాబీ జెండానేనని, ప్రతి పక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా డిపాజిట్లు కూడా దక్కించుకోరని అన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే ఘన విజయాన్ని కట్టబెడుతాయన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.