రామాయంపేట/ వెల్దుర్తి/ మెదక్ రూరల్/ కొల్చారం/ హవేళీఘనపూర్, ఫిబ్రవరి 8 : రైతులు వరినాట్ల వేసే ముందు నారు వేర్లను పీఎస్బీలో ముంచడంతోపాటు నారు కొనలను ఐదు ఇంచుల వరకు కత్తిరించి నాటుకోవాలని రామాయంపేట వ్యవసాయాధికారి రాజ్నారాయణ అన్నారు. రామాయంపేట శివారులోని మొగి పురుగుకు గురైన వరిపైర్ల్లను బుధవారం పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. రైతులు నూతన పద్ధ్దతులు పాటించాలన్నారు. నాట్లు వేసే సమయం లో ఫాస్పరస్ సాలిబుల్ బాక్టీరియా మందులో నారు వేర్లను ముంచిన తర్వాతే నాట్లు వేయించాలని సూచించారు. నారు కొనలలో మొగి పురుగు గుడ్లు ఉంటాయని, నారు అంచుల ను కత్తిరిస్తే పురుగు ఉధృతిని నివారించవచ్చని అన్నారు. ఏవో వెంట ఏఈవో సాయికృష్ణ ఉన్నారు.
జాగ్రత్తలు పాటిస్తే తెగుళ్ల నివారణ…
యాసంగి సాగులో వరిపైరుకు అగ్గితెగుళ్లు, మొగి పురుగు సోకి పంటలు దెబ్బతినే అవకాశం ఉందని వెల్దుర్తి మండల వ్యవసాయాధికారి స్వప్న అన్నారు. వెల్దుర్తిలో వరి పంటలను ఏఈవో వందనతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో స్వప్న మాట్లాడుతూ.. పంటలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, నీటి యాజమాన్య పద్ధ్దతులు పాటించాలన్నారు. తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని సూచిం చారు. మొగిపురుగు నివారణకు లీటర్ నీటికి కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 2గ్రాములు లేదా ఫ్రొఫెనోపాస్ 2 ఎంఎల్ను కలిపి పిచికారీ చేయాలన్నారు. అగ్గితెగుళ్లు నివారణకు లీటర్ నీటిలో ట్రై సైక్లోజోల్ 0.6 గ్రాములను కలిపి పిచికారీ చేయాలన్నారు. మురుగునీరు పారే పొలాల్లో ప్రతిరోజూ నీటిని తొలిగించి, కొత్త నీరు పారించాలని రైతులకు సూచించారు.
యాజయాన్య పద్ధతులు పాటించాలి
వరిపంటలో కాండం తొలుచు పురుగు నివారణకు రైతు లు యాజమాన్య పద్ధతులు పాటించాలని మండల వ్యవసా యాధికారి శ్రీనివాస్ అన్నారు. మెదక్ మండల పరిధిలోని మాగ్ధుంపూర్ ఏఈవో రాజశేఖర్తో కలిసి వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ.. తొలుచు పురుగు నివారణకు కార్టాఫ్హైడ్రోక్లోరైడ్ 2గ్రాములు, జింక్ లోప నివారణకు జింక్ సల్పేట్ 2గ్రాములు, ఆగ్రోమిన్-2గ్రా ములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు.
డీజిల్లో యూరియా కలిపి పిచికారీ చేయొద్దు
వరి పైరుకు యూరియాను డీజిల్లో కలిపి పిచికారీ చేయవద్దని కొల్చారం మండల వ్యవసాయాధికారి శ్వేతకుమారి రైతులకు సూచించారు. రంగంపేటలో వరిపంటను పరిశీలించారు. రైతులు యూరియాను డీజిల్లో కలిపి పిచికారీ చేస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. దీంతో నీటిపై తెట్టెగా ఏర్పడుతుందని, అలా ఏర్పడటంతో మొక్క వేర్లకు గాలి సోకకపోవడంతో మొక్క కుళ్లి చనిపోతుందన్నారు. రైతులు వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. .
కేవీకే ఆధ్వర్యంలో రైతులకు అవగాహన
హవేళీఘనపూర్ మండలంలోని తొగిటలో కృషి విజ్ఞాన కేంద్రం అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. కేవీకే సైంటిస్టులు శ్రీకాంత్రెడ్డి, ప్రతాప్రెడ్డి, శ్యాంసుందర్ రైతులకు వేరుశనగ, వరి పొలంలో వచ్చే చీడ పీడల నివారణ గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నాగమాధురి, ఏఈవో, రైతులు పాల్గొన్నారు.