గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో గురువారం నిరసనలు హోరెత్తాయి. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో పాటు అన్ని వర్గాల ప్రజలు, పార్టీల నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఖాళీ సిలిండర్లు ప్రదర్శించి కేంద్రం, మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ‘మోదీ డౌన్.. డౌన్, బీజేపీకో హఠావో.. దేశ్కో బచావో, అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రోడ్లపై వంటావార్పులు చేసి, పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్,నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మాణిక్రావు, మహారెడ్డి భూపాల్రెడ్డిలు ఆందోళనల్లో పాల్గొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలపై మోయలేని ఆర్థిక భారం వేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.
రామాయంపేట/ చేగుంట, మార్చి 2 : కేంద్ర ప్రభుత్వం పిల్లలు తాగే పాల నుంచి గ్యాస్, పెట్రో ధరలను పెంచి పేద ప్రజలు బతకకుండా చేస్తున్నదని.. దేశాన్ని కాపాడాలంటే ప్రధాని మోదీని ఇంటికి పంపించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం రామాయంపేట, చేగుం ట మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గ్యాస్ ధరలను నిరసిస్త్తూ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మెదక్ నియోజకవర్గ కేంద్రానికి వెళ్తున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి చేగుంటలో ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. దేశ్ బచావో మోదీ హఠావో నినాదంతో ఇంటింటికీ వెళ్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీని ఇంటికి పంపించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. గ్యాస్ ధరలను పెంచిన మోదీకి మహిళల ఊసురు తగులుతుందన్నారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి లేకుంటే వచ్చే ఎన్నికల్లో మహిళల ప్రతాపం చూపిస్తామన్నారు. చేగుంటలో ధర్నా చేస్తుండడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. బీఆర్ఎస్ నాయకులను పోలీసులు రోడ్డుపై నుంచి తరలించారు. కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ శ్రీనివాస్, మాజీ ఏఎంసీ చైర్మన్ రజనక ప్రవీణ్కుమార్, నాయకులు రాజిరెడ్డి, నారాయణరెడ్డి ఉన్నారు.
నార్సింగిలో మోదీ దిష్టిబొమ్మ దహనం
నార్సింగి మండల కేంద్రంలో ఎంపీపీ సబిత, వైస్ ఎంపీపీ సుజాత, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మైలారం బాబు, ఎం పీటీసీలు బాబు, సత్యం, నాయకులు తౌర్యానాయక్, శ్రీపతిరావు, నర్సింహచారి, సత్యం తదితరులు జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్, నిత్యావసరాల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
నేడు శివ్వంపేట, నర్సాపూర్, తూప్రాన్లో ఆందోళనలు
-హాజరుకానున్న ఎమ్మెల్యే మదన్రెడ్డి
శివ్వంపేట/ నర్సాపూర్ రూరల్/ తూప్రాన్, మార్చి 2 : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ శివ్వంపేటలో శుక్రవారం ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్ పేర్కొన్నారు. ఆందోళన కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్రెడ్డి హాజరుకానున్నారని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో శివ్వంపేటకు తరలిరావాలని కోరారు.
నర్సాపూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన, ధర్నా నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు భిక్షపతి తెలిపారు. ఎమ్మెల్యే మదన్రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిరసన కార్యక్రమానికి నాయకులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
తూప్రాన్ పట్టణ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై కరీంగూడ వద్ద శుక్రవారం నిరసనలు నిర్వహించనున్నారు. ధర్నా, నిరసన కార్యక్రమాల్లో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్ర తాప్రెడ్డి, ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని బీఆర్ ఎస్ తూప్రాన్ పట్టణాధ్యక్షుడు సరాఫ్ సతీశ్చారి కోరారు.