భవిష్యత్ తరాలకు ఆరోగ్యకర సమాజాన్ని అందించాలి
సంగారెడ్డి, మెదక్ జిల్లాల అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, ప్రతిమాసింగ్
సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 5 : పర్యావరణాన్ని రక్షించి, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లా కాలుష్య నియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో ప్రజలు, విద్యార్థులు, యువతతో కలిసి ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ వర్గాల ప్రజలతో పర్యావరణ పరిరక్షణపై ఏర్పాటు చేసిన సదస్సులో వీరారెడ్డి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కాలుష్య రహిత సమాజం కోసం పాటుపడాలన్నారు.
పర్యావరణ ముప్పుతో అన్ని జీవరాశులు, మానవ మనుగడకు ప్రమాదం వాటిల్లుతుందని వివరించారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు పర్యావరణ హితంగా ఉండేవని, మారుతున్న సమాజ పోకడలతో పలు రకాల కాలుష్యాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని స్వచ్ఛంగా నిషేధించాలని, ప్రతి ఇంట్లో విధిగా మొక్కలు నాటాలని, చెట్లు, అడవులతో సమృద్ధిగా వర్షాలు కురిసి వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందన్నారు. అప్పుడే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించిగలమని చెప్పుకొచ్చారు. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలను పారేయవద్దన్నారు. ప్రతి ఒక్కరికీ పర్యావరణంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు అందరూ కంకణబద్ధులై ఉంటామని, మొక్కలను నాటి సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాలుష్య నియంత్రణ బోర్డు ఈఈ సురేశ్, పరిశ్రమల ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
మెదక్ కలెక్టరేట్లో..
మెదక్ అర్బన్, జూన్ 5 : పర్యావరణాన్ని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని జల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ భవనంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడి భావితరాలకు మంచి వాతావరణం అందించాలన్నారు. అనంతరం మెదక్ పట్టణంలో గ్రీన్ ర్యాలీని ఆమె జెండా ఊపి పారంభించారు. ఈ కార్యక్రమంలో జేసీఈఈ శ్రీనివాస్రెడ్డి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.