చేర్యాల, ఏప్రిల్ 7: చేర్యాల పట్టణంలో చేపడుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. హైవే పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా 8 నెలల క్రితం డ్రైనేజీల నిర్మాణం కోసం గుంతల తవ్వారు. గుంతల వద్ద అసంపూర్తి పనులతో అందులో మురుగు చేరి పరిసరాలు దుర్గంధంగా మారి దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. హైవే నిర్మాణ పనులు ప్రణాళికా ప్రకారం చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మున్సిపల్ అధికారులతో పాటు నేషనల్ హైవే అథారిటీ (ఎన్హెచ్ఏఐ) అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
సూర్యాపేట-సిరిసిల్ల 365(బీ) రహదారి పనులు చేర్యాల పట్టణంలో కొన్ని నెలలుగా కొనసాగుతున్నాయి. రోడ్డు పనుల్లో భాగంగా మొదటగా కాంట్రాక్టర్ పట్టణంలోని రోడ్డుకు ఇరువైపులా పెద్ద డ్రైనేజీలు నిర్మిస్తున్నాడు. ఇందుకోసం నివాస గృహాలు, దుకాణాల ముందర రెండు వైపులా పెద్దపెద్ద గుంతలు తీస్తున్నాడు. ఈ గుంతలు ఒక్కోచోట ఒక్కో లెక్క తీస్తుండడంతో ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డుకు ఇరువైపులా నిర్మిస్తున్న డ్రైనేజీలు మురుగు గుంటలుగా మారాయి. విద్యుత్ స్తంభాలు ఉన్నాయనే సాకుతో కాంట్రాక్టర్ అక్కడక్కడా పనులు చేయకుండా వదిలిపెట్టడంతో ఇండ్లళ్ల నుంచి వచ్చిన నీళ్లతో మురుగు పేరుకుపోయి దోమలు పెరిగాయి. దోమల నివారణకు మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అసంపూర్తి పను లు, డ్రైనేజీల కంపు, దోమలతో పట్టణవాసు లు నరకయాతన అనుభవిస్తున్నారు.
రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ కొన్నిచోట్ల విద్యు త్ స్తంభాలను వదిలిపెట్టి నిర్మాణ పనులు కొనసాగిస్తున్నాడు. డ్రైనేజీ నిర్మాణ సమయంలో కాంట్రాక్టర్ కింద పనిచేసేవారికి డబ్బులు ముట్టచెబితే విద్యుత్ స్తంభం ఉన్నప్పటికీ దాని ని అనుకుని డ్రైనేజీ నిర్మిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభా లు ఉన్నాయని పనులు నిలిపివేసి మరోచోట పనులు చేస్తుండడం గమనార్హం. మున్సిపల్, ఎన్హెచ్ఏఐ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.