ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతున్నది. అర్హులందరికీ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రామ, వార్డు సభల వద్ద ప్రజలు ఆయా పథకాల కోసం అర్జీలు పెట్టుకుంటున్నారు. దరఖాస్తు ఫారాలు నింపడంలో అనేక సందేహాలు ఉన్నప్పటికీ అధికారులు నివృత్తి చేయడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు పథకాలకు ఆధార్, రేషన్కార్డు తప్పనిసరి చేయడంతో అప్డేట్ కోసం ఆయా సెంటర్ల వద్ద ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. గురువారం పలు గ్రామాలు, పట్టణాల్లో కొనసాగుతున్న కార్యక్రమాన్ని ఉన్నతాధికారులు పరిశీలించారు.
చేగుంట/ తూప్రాన్, జనవరి 4: ప్రజలు ఇచ్చే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. చేగుంట మండలం పోలంపల్లి, తూప్రాన్ మున్సిపాలిటీలోని 11వ వార్డు (పడాలపల్లి)లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాన్ని గురువారం సందర్శించి, దరఖాస్తుల తీరుతెన్నులు, రిజిస్టర్లో నమోదు చేసిన వివరాలను పరిశీలించారు. అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ.. ప్రజలు అందజేస్తున్న ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులను తప్పులు లేకుండా పూర్త్తి చేయాలని సంబంధిత అధికారులు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న గ్యారెంటీ పథకాలకు దరఖాస్తు చేసుకునే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని ఆదేశించారు. పథకాల అమలును ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని కలెక్టర్ సూచించారు.
ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. చేగుంట, నార్సింగి మండలాల్లో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. పొలంపల్లిలో జరిగిన కార్యక్రమంలో చేగుంట మండల ప్రత్యేకాధికారి జమ్లానాయక్, తహసీల్దార్ గియాఉన్నీసాబేగం, ఆర్ఐ నర్సింగ్యాదవ్, ఏవో హరిప్రసాద్, ఏఈవోలు మాధవి, శోభ, ఏపీఎం లక్ష్మీనర్సమ్మ, ఏఈ వెంకటేశ్, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ యెన్నెల్లి నిర్మలాసత్యం పాల్గొన్నారు. తూప్రాన్ మున్సిపాలిటీలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్, కౌన్సిలర్ అరుణావెంకట్గౌడ్, జడ్పీ సీఈవో వెంకటశైలేశ్, తహసీల్దార్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఖాజామొయిజుద్దీన్ పాల్గొన్నారు.