మెదక్ రూరల్/మెదక్ అర్బన్/రామాయంపేట/ రామాయంపేట రూరల్/రేగోడ్/నిజాంపేట/పాపన్నపేట/చిన్నశంకరంపేట, నవంబర్ 30: మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మెదక్ జిల్లా వ్యాప్తంగా నమోదైన పోలింగ్ 86.69 శాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. గురువారం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సిబ్బంది ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు ప్రశాంతంగా కొనసాగింది. ఎన్నికల్లో భాగంగా మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి రామాయంపేట పురపాలికతో పాటు అన్ని గ్రామాల్లోని పోలింగ్ బూత్లను పరిశీలించి అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులను పోలింగ్ సరళిని తెలుసుకున్నారు.
ఈ ఎన్నికల్లో నూతనంగా ఓట్లు పొందిన యువతీ, యువకులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. పోలింగ్ బూత్ల పనితీరును జిల్లా ఎన్నికల అబ్జర్వర్ సంజయ్కుమార్, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, మండల ఎన్నికల అధికారులు రజనీకుమారి, ఉమాదేవి పర్యవేక్షించి సిబ్బందికి సూచనలు చేశారు. పాపన్నపేట మండల పరిధిలోని 58 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, దాదాపు అన్ని పోలింగ్ కేం ద్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నిజాంపేట మండల వ్యాప్తంగా 28 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అభ్యర్థి మండలంలోని పలు గ్రామాల పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ ప్రక్రియ పరిశీలించారు.
కల్వకుంటలో బీఆర్ఎస్ జిల్లా ఎన్నికల ఇన్చార్జ్ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల పోలింగ్ బూత్ నంబర్ 131 వద్ద ఓటు హక్కును వినియోగించుకొని వస్తున్న బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్పై, మాజీ కో అప్షన్ మెంబర్ సాధిక్లపై కాంగ్రెస్ నాయుకులు అరిఫ్ జలీల్, మహ్మద్ జమీయొద్దీన్, సయ్యద్ తాహెర్ అలీ, ఎంఏ ఖాలీజ్లు ఆర్అండ్బీ రోడ్డు వద్ద బండిపై వస్తుండగా దాడి చేశారని గంగాధ ర్ తెలిపారు. కాంగ్రెస్ దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.