మెదక్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : పీఎం కిసాన్ లబ్ధిదారులందరూ తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. గురువారం తన చాంబర్లో వ్యవసాయాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 1,36,109 రైతులు పీఎం కిసాన్ లబ్ధిదారులుగా గుర్తించామని, ఇందులో ఇప్పటి వరకు 97,091 మంది రైతులు ఈ కేవై సీ చేయించుకున్నారని తెలిపారు. ఇంకా 39,018 మంది రైతులు ఈ కేవైసీని చేయించుకోవాల్సి ఉందన్నారు. 13వ విడుత పీఎం కిసాన్ నిధులు తమ బ్యాంకు ఖాతాల్లో జమ కావాలంటే తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని రమేశ్ రైతులకు సూచించారు.
వ్యవసాయ శాఖ అధికారుల సాయంతో కానీ జిల్లా వ్యాప్తంగా ఉన్న మీసేవ, కామన్ సర్వీస్ సెంటర్, పోస్టాఫీస్ల్లో గానీ సంప్రదించి పీఎం కిసాన్కు తమ ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ను అనుసంధానం చేసుకోవాలని రైతులకు సూచించారు. కాగా జిల్లాలో ఈకేవైసీ ప్రక్రియ 71 శాతం పూర్తయిందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ఈకేవైసీ ప్రక్రియ విధానంపై అవగాహన కల్పించి వేగవంతంగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆశా కుమారి, సహాయ వ్యవసాయ సంచాలకులు రాజ్ నారాయణ, వ్యవసాయ అధికారి హర్ష, డీఎస్వో శ్రీనివాస్ పాల్గొన్నారు.