ఎనిమిదో విడత మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు
మెదక్ మున్సిపాలిటీలో 4 లక్షలు లక్ష్యం
8 నర్సరీలు.. ఒక్కో నర్సరీలో 50 వేలకు పైగా మొక్కలు
మెదక్ మున్సిపాలిటీ, మే 22: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా రాష్ర్టాన్ని పచ్చదనంగా మార్చేందుకు ఏటా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నది. ఇప్పటి వరకు ఏడు విడతలు విజయవంతంగా కాగా, ఈ ఏడాది ఏనిమిదో విడతకు సిద్ధమవుతున్నారు. పల్లె, పట్టణ ప్రగతితో పాటు హరితహార కార్యక్రమాలను పది రోజుల పాటు నిర్వహించి విజయవంతం చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో మున్సిపాలిటీల్లో చర్యలు ప్రారంభించారు. రెండేండ్లుగా మున్సిపాలిటీల్లో సైతం గ్రీన్ ఫండ్ ద్వారా నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కల పెంపకం చేపడుతున్నారు. నర్సరీల్లో మొక్కల పెంపకానికి మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో ప్రారంభమయ్యే హరితహారానికి మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో ఖాళీ స్థలాలు, పార్కులు గుర్తించి మొక్కలు నాటి సంరక్షించడమే లక్ష్యంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు పంపిణీ చేసేలా వ్యూహాత్మక ధోరణితో ముందుకెళ్తున్నారు.
మెదక్ పట్టణంలో 8 నర్సరీలు
జిల్లా కేంద్రంలో 8 నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కల పెంచుతున్నారు. తారకరామనగర్, ఐడీఎస్ఎంటీ కాల నీ, వెంకట్రావ్నగర్ కాలనీ, మీనానగర్ కాలానీ, చిల్డ్రన్ పార్క్లో నర్సరీలు ఏర్పాటుచేశారు. జనవరి చివరి వారం నుంచే మొక్కల పెంపకం చేపట్టారు. మొత్తం 4 లక్షల మొక్కల పెంపకం లక్ష్యంగా కాగా.. ఒక్కో నర్సరీలో 50 వేలకు పైగా మొక్కలు పెంచుతున్నారు.
నర్సరీల్లో భారీగా పెరిగిన మొక్కలు
హరితహారంలో నాటేందుకు మొక్కల కొనుగోలుకు స్వస్తి పలికారు. ఏ మున్సిపాలిటీలో ఏమేర మొక్కలు అవసరం, ఎలాంటివి నాటేందుకు ఇష్టపడుతున్నారో ఆ మొక్కలే పెంచేందుకు నర్సరీలు ఏర్పాటు చేశారు. నర్సరీల వారీగా లక్ష్యాన్ని విధించారు.
గ్రీన్ఫండ్ ద్వారా..
పట్టణాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు మున్సిపాలిటీలకు వచ్చే అభివృద్ధి నిధుల్లో 10 శాతం హరితహారానికి ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మున్సిపల్ చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నది. మెదక్తో పాటు రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటికి ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, ఆర్థిక సంఘం నుంచి అభివృద్ధి కోసం నిధులు విడుదలవుతాయి. కేంద్రం ఇచ్చే నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆర్థిక సంఘం నిధులు ఇస్తున్నది. పట్టణ ప్రగతితో ప్రత్యేక నిధులు సమకూర్చుతున్నది. ప్రతి మున్సిపాలిటీకి క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తున్నారు. ఈ నిధులు జనాభా ఆధారంగా మున్సిపల్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ నిధుల్లో నుంచి 10 శాతం హరితహారానికి మాత్రమే ఖర్చు చేయాలి. మొక్కల పెంపకం, నాటడం, ట్రీగార్డులు కొనుగోలు చేయడం వంటి వాటికి ఖర్చు చేయాలి. వేరే వాటికి ఈ నిధులు ఖర్చు చేయవద్దు. ఒక వేళ ఖర్చు చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. గ్రామాల్లో నర్సరీల్లో మొక్కలు పెంపకానికి ఉపాధి హామీ నిధులు వినియోగించి నర్సరీల పెంపకాన్ని చేపడుతున్నారు. మున్సిపాలిటీల్లో ఉపాధి హామీ నిధులు కాకుండా గ్రీన్ఫండ్ నిధులతో నర్సరీల నిర్వహణ చేపడుతున్నారు.
నాటేందుకు మొక్కలు సిద్ధం..
ఎనిమిదో విడుత హరితహారం కోసం నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేశాం. ముఖ్యమంత్రి ఈనెల 20 నుంచి హరితహారం కార్యక్రమం చేపట్టాలని ప్రకటించారు. ఆ రోజు నుంచి ఘనంగా నిర్వహిస్తాం. పట్టణంలో ఏర్పాటు చేసిన 8 నర్సరీల్లో 4 లక్షలకు పైగా మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి.
– శ్రీహరి, మున్సిపల్ కమిషనర్, మెదక్
ప్రతి ఒక్కరూ పచ్చదనం పెంచాలి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహార కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నాం. పట్టణంలో మొక్కలు నాటేందుకు ఇప్పటికే ఖాళీ స్థలాలు గుర్తిం చాం. ఇంటి ఆవరణలో స్థలం ఉన్నవారికి పండ్లు, పూల మొక్కలు పంపిణీ చేస్తాం. హరితహారంలో పచ్చదనాన్ని పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
– తొడుపునూరి చంద్రపాల్, మున్సిపల్ చైర్మన్