జహీరాబాద్, మార్చి 2: ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లో కందులకు అధిక ధర లభిస్తుండడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. కందులకు బహిరంగ మార్కెట్లో అధిక ధర ఉండడంతో రైతులు ఈ ఏడాది అధికంగా సాగుచేశారు. జహీరాబాద్ డివిజన్లో కంది అంతర పంటగా సాగుచేస్తారు. వానకాలంలో పెసర, మినుము, జొన్న, మొక్కజొన్న, సోయాలో అంతర పంటగా సాగుచేశారు. జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్ మండలాల్లో అధికంగా కంది సాగైంది. కందికి ప్రభుత్వం క్వింటాల్కు మద్దతు ధర రూ.7వేలు ప్రకటించింది. జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కందులు రూ. 10,155 వేలకు క్వింటాల్గా కొనుగోలు చేస్తున్నారు.
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లో అధిక ధర ఉండడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రైతులు బస్తా కూడా అమ్మలేదు. వ్యవసాయ మార్కెట్లో ఈ సీజన్లో వ్యాపారులు 27,288 క్వింటాల్ కందులు కొనుగోలు చేశారు. మద్దతు ధర కంటే అధిక ధర మార్కెట్లో ఉండడంతో రైతులకు ఈ ఏడాది గిట్టుబాటు అవుతున్నది. మొక్కజొన్నకు ప్రభుత్వ మద్దతు ధర రూ. 2090 ఉండగా, బహిరంగ మార్కెట్లో రూ.2290 క్వింటాల్కు అమ్మకాలు జరిగాయి. జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఈ-నామ్ ద్వారా కందులు 27,288 క్వింటాళ్లు, సోయా 61,500 క్వింటాళ్లు, మొక్కజొన్న 50,447 క్వింటాళ్లు, శనగ 5195 క్వింటాళ్లు కొనుగోలు చేశారు.