మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి
దుబ్బాకలో పట్టణ ప్రగతి కార్యక్రమం
పలు వార్డుల్లో పర్యటించిన ఎంపీ
దుబ్బాక, జూన్ 5 : ‘అమ్మా మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా.. మీ వార్డులో మురుగు కాల్వలు శుభ్రం చేస్తున్నారా.. బీడీ, చేనేత, వృద్ధాప్య పింఛన్లు వస్తున్నాయా.. ఏమైనా సమస్యలు ఉన్నాయా’ అంటూ దుబ్బాక పట్టణంలోని పలు వార్డుల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. నాల్గో విడత పట్టణ ప్రగతిలో భాగంగా ఆదివారం 19, 20వ వార్డుల్లో నిర్వహించిన ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితారెడ్డి, కమిషనర్ గణేశ్రెడ్డి, కౌన్సిలర్తో కలిసి ఎంపీ పారిశుధ్య పనులు చేపట్టారు. 20వ వార్డులో మురుగు కాల్వలో చెత్తను ఎంపీ స్వయంగా తొలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టిందన్నారు. పచ్చదనం, పారిశుధ్యం, తాగునీరు, పరిసరాల పరిశుభ్రత తదితర వాటిపై ప్రజలను చైతన్య పరుస్తున్నట్లు వివరించారు.
ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిషేధించడంతోపాటు ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని, పర్యవరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని సూచించారు. వార్డుల్లో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి తాగునీరు, తదితర సమస్యలపై ఆరా తీశారు. భగీరథ నల్లా నీరు సరఫరాతో నీటి సమస్య లేకుండా పోయిందని మహిళలు సం తృప్తి వ్యక్తం చేశారు. పట్టణంలో పారిశుధ్య పనులు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ పేదలకు అందజేస్తున్న ఆసరా పింఛన్ పథకం అండగా మారిందని, టీఆర్ఎస్ సర్కారుకు రుణపడి ఉంటామని పలువురు మహిళలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు లోంక రాజవ్వ, బంగారయ్య, బాలకృష్ణ, స్వామి, నాయకులు రొట్టే రాజామౌళి, పల్లె రామస్వామి గౌడ్, భూంరెడ్డి, రాజిరెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు.