ఎండలో సుదీర్ఘ ప్రయాణం ప్రమాదకరం
నీడలో పెడితేనే శ్రేయస్కరం
నిజాంపేట, మే6: వేసవిలో వాహనం జాగ్రత్త!. వేసవిలో వాహనాలను ఎండలో పార్కింగ్ చేయడంతో జరిగే ప్రమాదాలు ముందుగా తెలుసుకోవడంతో ధన, ప్రాణ నష్టాలు కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఎండలో వాహనాలు పార్కింగ్ చేస్తే..
ఎండలో వాహనాలు పార్కింగ్ చేస్తే జేబుకు చిల్లు పడటం ఖాయం. వేసవిలో మనకు వడ దెబ్బ తగులకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఎండగా అనిపించగానే చాలు నీడ ఉన్న ప్రదేశాల్లోకి వెంటనే వెళ్తాం. వాహనాలను కూడా ఎల్లప్పుడూ నీడ ఉన్న ప్రదేశాల్లోనే పార్కింగ్ చేయాలి. ఇలా చేయడంతో వాహనాల రంగుతో పాటు ఇంధనం ఆవిరి కాదు. వాహనం సురక్షితంగా ఉంటుంది.
దూర ప్రయాణం వద్దు
కొంతమంది బైక్లపై దూర ప్రయాణం (లాంగ్ డ్రైవ్) చేయడానికి ఇష్టపడుతారు. వేసవి కాలంలో ఈ రకం ప్రయాణం చాలా ప్రమాదకరం. రోడ్డుతో పాటు పరిసర ప్రాంతాలు ఎండతో వేడిక్కిపోతాయి. దీంతో బైక్ల ఇంజిన్, టైర్లు త్వరగా వేడెక్కుతాయి. కొన్ని సందర్భాల్లో టైర్లు పేలిపోయి ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం వాటిల్లవచ్చు. బైక్ పైనే వెళ్లాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాత్రం మార్గమధ్యలో చల్లటి ప్రదేశాలు చూసుకుని ఆగి, కాస్తంతా విశ్రాంతి తీసుకోవడం మంచిది.
ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు
ఎండలో వాహనాల ఇంజిన్ ఆయిల్ తొందరగా వేడెక్కి పలుచనవుతుంది. వేసవి కాలం ప్రారంభంలోనే వాహనాల ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలి. ట్యాంక్పై మందంగా ఉన్న కవర్ను ఏర్పాటు చేసుకోవడంతో పెట్రోల్ ఆవిరి కాకుండా కాపాడుకోవచ్చు. అరిగి ఉన్న టైర్లు, పంక్చర్లు ఉన్న ట్యూబులు ఉంటే వెంటనే మార్చుకోవాలి. ఎండలో ఎక్కువ సమయం వాహనాలు ఉంచడంతో రంగు వెలసిపోవడంతో పాటు వాహన జీవిత కాలం క్రమేపి తగ్గుతుంది. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల సమయంలో బైక్ ప్రయాణం చేయకపోవడం చాలా మంచిది.
నీడలో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి
వేసవిలో బైక్లపై దూర ప్రయాణాలు చేయవద్దు. ఎండ వేడికి టైర్లు మెత్త బడి గాలి తగ్గి, బైక్ మధ్యలోనే ఆగిపోతుంది. ఒక్కోసారి బైక్ టైర్లు పేలి అదుపు తప్పి ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. వేసవిలో ఈ సమస్య అధిగమించడానికి వాహనదారు లు తమ వాహనాలను ఎప్పుడూ నీడలోనే పార్కింగ్ చేయాలి. నా షెడ్డుకు వచ్చే ప్రతి కష్టమర్కు నీడలో వాహనాలు పార్కింగ్ చేయాలని సూచిస్తాను. – కిషన్, బైక్ మెకానిక్, నిజాంపేట