జనగామ, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ) : ‘జనగామ మట్టి బిడ్డ పల్లా రాజేశ్వర్రెడ్డి..ఎంట్రీతోనే ఘన విజయం వైపు అడుగులు వేశారని..ఇద్దరం ఒకే హైట్లో ఉన్నాం..సేమ్ ైస్టెల్లో అభివృద్ధి కూడా ఉంటుంది’ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ శ్రేణుల సమన్వయ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ, జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ టి.రాజయ్య, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, జడ్పీచైర్మన్ పాగాల సంపత్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జల్లి సిద్ధయ్య, మున్సిపల్, మార్కెట్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ జనగామ అంటే కేసీఆర్ చాలా ప్రేమ.. ఏసందర్భం వచ్చినా ఇక్కడి ఉద్యమాలు, ఉద్యమకారుల గురించి పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడుతారన్నారు. 2001లోనే జనగామ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో గులాబీజెండా ఎగిరిన గడ్డ..తెలంగాణ ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీకి అడ్డా..గులాబీజెండాకు ఇది డెన్ లాంటిదన్నారు. నాకు మాత్రం చాలా సంతోషం కలిగిందని..మా ముత్తిరెడ్డి అన్న పల్లాను నిండు మనస్సుతో ఆశీర్వదించి..ముందు ముం దు ఏం చేయాలో బరువు, బాధ్యతలు కూడా అప్పగించారన్నారు. బిడ్డ పోతుంటే తల్లి కండ్లలో నీళ్లు పెట్టుకుంటది..కానీ మా ముత్తన్న మాత్రం ప్రేమతో స్వీటు తినిపించి నిండు మనస్సుతో దీవించాడు అని హరీశ్రావు కొనియాడారు. ముందే జనగామ బీఆర్ఎస్కు కంచుకోట..ఇక ముత్తన్న ఆశీస్సులతో పల్లా గెలుపు పక్కా అయిందని సంతోషం వ్యక్తం చేశారు.
లక్ష మందితో జనగామ సభ..
సీఎం కేసీఆర్ 16న జనగామ వస్తున్నాడని..మీ తర్వాత సిద్దిపేట సభ ఉంటుందని ఇక్కడ మీరు ఎంత మందిని తరలిస్తారో నేను అంతకంటే ఎక్కువ తెస్తా అని హరీశ్రావు అన్నారు. జనగామ సభ లక్ష మందితో జరగాలి..కార్యకర్తలు ముందుండి నడిపించాలి..అన్నపానీయాలు లేకున్నా ఎంతో ఓపికగా కదలకుండా సభలో ఉన్నారంటే నిజంగా మీరెంత గొప్పవాళ్లు అంటే మీ కాళ్లు కడిగి నెత్తిన పోసుకోవాలని..నిజంగా ఇంత గొప్ప కార్యకర్తలు ఉండటం బీఆర్ఎస్ పార్టీ అదృష్టమన్నారు. యాదగిరిరెడ్డి అన్న ఫుల్లీ ఫిట్ అయినా తనకు టికెట్ రాకపోయినా ఈ వేదికపై ఉండి పల్లాను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని పిలుపునిచ్చిన గొప్ప సంకల్పం ఆయనది..నిజంగా రాజకీయాల్లో ఇలాంటి సన్నివేశాలు చాలా అరుదు..కాటికి కాళ్లు చాపే వరకు కూడా నేనే నిలబడుతున్నా అంటరు.. కానీ యాదగిరిరెడ్డన్న మాత్రం ఇగో నేను అప్పజెపుతున్న.. నా ఫొటో పెట్టకండి.. తమ్ముడు రాజేశ్వర్రెడ్డే మీ నాయకుడు.. ఆయన్ను గెలిపించండి అని నిండు మనస్సుతో ముత్తిరెడ్డి దీవించారన్నారు.
కాంగ్రెస్లో తన్నుకునుడే..
కాంగ్రెస్లో చూసిండ్లా ఇంకా టికెట్లే ఇవ్వలేదు.. తన్నుకుంటున్నరు.. నిన్న గాంధీభవన్లో తన్నుకున్నరు.. మొన్న ఓ వ్యక్తి కోట్లకు సీట్లు అమ్ముకున్నరని పబ్లిక్గా చెప్పిండు అని హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ అంటే మనకు తెల్వదా మాటలు.. మంటలు.. ముఠాలు.. అది వాళ్ల పార్టీ సంస్కృతి అని ఎద్దేవా చేశారు. డబ్బు మూటలు.. కూర్చీల కోసం మత చిచ్చు మంటలు పెట్టి ప్రజలను చంపడానికి కూడా వెనుకకు పోని పార్టీ ఏదైనా ఉందా అంటే అది కాంగ్రెస్సే.. ముఠాలు కట్టి నాయకుల మధ్య గ్రూపు కొట్లాటలు.. మాటలు ఒకరినొకరు తిట్టుకోవడం అని అన్నారు. అటువంటి పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఎంత తేడా ఉంది?
టికెట్ మార్చినా నిండు మనస్సుతో అప్పగింతలు చేసిన పార్టీ మన బీఆర్ఎస్ ఇదీ కేసీఆర్.. ప్రజలు, పార్టీ, నాయకులను ఎంత చక్కగా నడుపగలుగుతున్నారనే దానికి ఇదీ ఒక ఉదాహరణ అని హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను పక్కనున్న కర్ణాటకలో కాంగ్రెస్ ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అమలు చేయని పథకాలు తెలంగాణలో అమలు చేస్తామని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ అంటే నమ్మకం..విశ్వాసం..
కేసీఆర్ అంటే ఒక నమ్మకం..ఆ పాలన పట్ల ప్రజలకు విశ్వాసం అని గతంలో ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్కటైనా కాంగ్రెస్ పార్టీ అమలు చేసి చూపిందా? అదే బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టినవి.. పెట్టనవి కూడా అమలు చేశాం..మావి ఓట్ల కోసం అమలు చేసే పథకాలు కాదు.. ప్రజల అవసరాలు తెలుసుకొని చేసే పనులని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు ఓటమి తప్పదని, బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించి మూడోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముస్లింలు ఆటో డ్రైవర్లుగా పనిచేస్తే, తెలంగాణ ప్రభుత్వ హయాంలో డాక్టర్లు, ఇంజినీరింగ్ చదువుకుంటున్నారన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని, బీజేపీ గెలువది, కాంగ్రెస్ లేవదు అని హరీశ్రావు అన్నారు. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేస్తున్నామని గుర్తుచేశారు.
జనగామ అప్పుడెట్లుండే.. ఇప్పుడెట్లున్నది..
“కాంగ్రెస్ హయాంలో జనగామ ఎట్లుండె… ఇప్పుడు ఎట్లుందో ఒకసారి ఆలోచించండి.. అభివృద్ధి మీ కండ్ల ముందున్నది.. ఒకనాడు కరువు విలయ తాండవం చేసిన ఎగువ ప్రాంతాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసిన బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలి’ అని మంత్రి హరీశ్రావు అన్నారు. జనగామలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాం..అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తున్నం.. జాగ ఉన్న వారికి గృహలక్ష్మి కింద ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తున్నదన్నారు. నియోజకవర్గంలో విద్య, వైద్యం, రోడ్లకు ఎంతో ప్రాధాన్యమిచ్చాం, జనగామలో మెడికల్ కాలేజీ ప్రారంభించుకున్నామ న్నారు.
ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డిని ఆశీర్వదిస్తే కేసీఆర్తో కొట్లాడి మరీ సిద్దిపేట, సిరిసిల్ల్లతో పోటీ పడి జనగామను మరింత అభివృద్ధి చేస్తారన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇవ్వని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. చేర్యాలను డివిజన్ కేంద్రంగా ప్రకటించే అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని హరీశ్రావు హామీ ఇచ్చారు.
15న బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన మరుసటిరోజు కేసీఆర్ జనగామకు వస్తున్నారని, తెలంగాణలో ఇది రెండోసభ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలి ఎన్నికల సభ జరుగుతుందన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకునే.. అందరికీ అందుబాటులో ఉండే అద్భుతమైన ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డిని కేసీఆర్ ఎంపిక చేసి మీ వద్దకు పంపించారని మంత్రి హరీశ్రావు అన్నారు.