మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 1: మెదక్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని, దాదాపు 50 వేల భారీ మెజార్టీతో పద్మాదేవేందర్రెడ్డి విజయం సాధిస్తారని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్ శుక్రవారం ఒక ప్రకటనలో ధీమా వ్యక్తం చేశారు. నవంబర్ 30న జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మెదక్ పట్టణంతో పాటు నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పక్షానే నిలిచారని అన్నారు. ఈ నెల 3న ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాలకు, ధన రాజకీయం చేసిన వారికి చెంపపెట్టులాగా వస్తాయని, మెదక్ నియోజకవర్గ ప్రజలు ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా తీర్పు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గ్లోబల్ ప్రచారాలను ప్రజలు నమ్మలేరన్న విషయాన్ని గురువారం జరిగిన ఓటింగ్ సరళి చూస్తేనే తెలిసిపోయిందన్నారు. ఫలితాల అనంతరం ప్రతిపక్ష పార్టీలు తట్టబుట్టా సర్దుకొని వెళ్లి పోవాల్సిందేనని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిలో రాష్ర్టాన్ని పరుగులు పెట్టిస్తున్న బీఆర్ఎస్కే ఓటు వేయాలన్న భావన ఓటర్లలో కనిపించిందన్నారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. మెదక్ నియోజకవర్గాన్ని మునుపెన్నాడు లేని విధంగా పద్మాదేవేందర్రెడ్డి అభివృద్ధి చేశారని.. చేసిన అభివృద్ధిని ఆకాంక్షించే ప్రజలంతా కారు గుర్తుకు ఓటేశారని విశ్వాసం వ్యక్తం చేశారు. పద్మాదేవేందర్రెడ్డి విజయంతో మెదక్ నియోజకవర్గ అభివృద్ధి పరంపర కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కానుందన్నారు. ఎన్నికల్లో నెల రోజులుగా బీఆర్ఎస్ విజయానికి సైనికులుగా పనిచేసిన ప్రతి కార్యకర్తకు, బీఆర్ఎస్ శ్రేణులకు పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు గంగాధర్ పేర్కొన్నారు