పాపన్నపేట, డిసెంబర్ 8: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధిచెప్పాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా పాపన్నపేటలో బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్,వార్డు స్థానానికి బరిలో ఉన్న అభ్యర్థులు కొడపాక సర్పంచ్ అభ్యర్థి గౌరిగారి పంకజ, బాచారం సర్పంచ్ అభ్యర్థి సొంగ పవిత్ర తరపున ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లెల ప్రగతి కోసం నిస్వార్థంగా పనిచేసేదెవరో ఆలోచించి ఎన్నికల్లో ప్రజలు ఓటువేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
పంచాయతీ ఎన్నికలు ఉన్నాయని గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు కానీ పట్టణాల్లో ఎన్నికలు లేవని చీరలు ఇవ్వలేదన్నారు.ఓట్ల కోసమే చీరలు పంపిణీ చేసిన విషయాన్ని మహిళలు గ్రహించాలన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. కాంగ్రెస్ రెండేండ్లలో గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదన్నారు.కాంగ్రెస్ మోసపూరితమైన వాగ్దానాలు చేసి ప్రజల ఓట్లను దం డుకొని ఆ తర్వాత మొండిచేయి చూపిందని విమర్శించారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకుండా ప్రజలను వంచిందని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో వాగ్దానం చేసిన ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదన్నారు. ప్రచారంలో మాజీ సర్పంచ్లు సంగప్ప, వెంకట్రాములు, మాజీ ఎంపీటీసీ చారి, నాయకులు దుర్గయ్య, దత్తు, శ్రీనివాస్గౌడ్, బాల య్య, చాన్ బాషా, సాయివర్దన్గౌడ్ పాల్గొన్నారు.