రామాయంపేట/ చిన్నశంకరంపేట/ నిజాంపేట/ పాపన్నపేట/ వెల్దుర్తి, మే16: అకాల వర్షాలకు రైతన్నలు అతలాకుతలం అవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం చేతికొచ్చిన సమయంలో భారీ ఉరుములు, మెరుపులు, గాలిదుమారం, పిడుగులతో కురుస్తున్న వర్షాలకు ఆరబోసిన, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసి ముైద్దెంది. తెల్లవారితో తూకం వేసే ధాన్యం వానతో తడిసి పోయిందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అర్ధరాత్రి భారీ శబ్ధంతో ఉరుములు, మెరుపులు వర్షం రావడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. టార్పాలిన్లు, ఇవ్వకనే ఇలా నష్టపోవాల్సి వచ్చిందని వాపోయారు. చిన్నశంకరంపేట మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం తెల్లవారుజామున గాలివాన బీభత్సం సృష్టించింది.
కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముైద్దెంది. ఆరబెట్టిన ధాన్యం వర్షపు నీటిలో మునిగి పోయింది. కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, చెట్లు నేలకొరిగాయి. చేతికొచ్చిన పంట తడిసి ముద్దకావడంతో రైతులు ఆందోనళ చెందుతున్నారు. కొన్ని గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. వరి పంట నేలకొరిగింది. పాపన్నపేట మండలంలోని ఆయా గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మెదక్, బొడ్మట్పల్లి రహదారిపై కొత్తపల్లి వద్ద తాత్కాలిక రోడ్డు వద్ద ట్రాఫిక్ జాం అయ్యింది. నిజాంపేటతో పాటు పలు గ్రామాల్లోనూ భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాలు, సబ్ మార్కెట్ యార్డుల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసింది. వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోయింది. వరికోతలు పూర్తి కావడంతో పెద్దఎత్తున ధాన్యం బండలపై, ఖాళీ స్థలాలు, కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోశారు. ధాన్యం తడవడం, మళ్లీ ఆరబోయడంతో తూకం వేయడానికి ఇబ్బందిగా మారింది. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.