జిల్లాలో 406 కొనుగోలు కేంద్రాలు
ఇప్పటి వరకు 1,56,577.62 మెట్రిక్ టన్నుల సేకరణ
రైతుల ఖాతాల్లో రూ. 54.57 కోట్లు జమ
సెంటర్లకు భారీగా ధాన్యం వస్తుండడంతో ఆ మేరకు ఏర్పాట్లు
పర్యవేక్షిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు
తడిసిన ధాన్యం సేకరణకు చర్యలు
యాసంగి ధాన్యం సేకరణ జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్నది. ధాన్యం కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా భారమైనా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి కొంటున్నది. మహిళా, సహకార సంఘాలు, మార్కెట్ కమిటీలు, మెప్మా ద్వారా మొత్తం 406 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇప్పటి వరకు 1,56,577 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. 75,442 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్మిల్లులకు తరలించారు. 15,283 మంది రైతుల నుంచి ధాన్యం కొని, 5,238 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 54.57 కోట్లు జమచేశారు. క్వింటాల్కు ప్రభుత్వం మద్దతు ధర రూ. 1960, కామన్ రకానికి రూ. 1940 నిర్ణయించింది. కేంద్రాలకు భారీగా ధాన్యం వస్తుండడంతో ఎక్కడా అవాంతరాలు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
సిద్దిపేట, మే 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పల్లెల్లో ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. రైతు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. ఇటీవల అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రైతుల ముంగిటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తున్నారు. జిల్లాలోని ధాన్యం కొనుగోళ్ల పై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఎప్పటికప్పుడు అధికారులను, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. జిల్లా అధికారులు కొనుగోలు కేంద్రాలను సందర్శించి సమస్యలను పరిష్కరిస్తున్నారు.
జిల్లాలో 413 కేంద్రాలు ప్రారంభం
జిల్లాలో రైతుల ముంగిటనే రాష్ట్ర ప్రభుత్వం 406 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తున్నది. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు లారీల్లో లోడింగ్ చేసి మిల్లులకు, గోదాములకు తరలిస్తున్నారు. మహిళా సంఘాలు 221, సహకార సంఘాల ద్వారా 173, మార్కెట్ కమిటీల ద్వారా 7, మెప్మా ద్వారా 5 మొత్తంగా ఆయా కేంద్రాల్లో 1,56,577.62 మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు 75,442 మెట్రిక్ టన్ను ల ధాన్యాన్ని రైస్మిల్లులకు తరలించారు. ఇంకా 81,135 మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాల్లో అందుబాటులో ఉంది. మొత్తం ధాన్యం విలువ రూ.147.86 కోట్లు ఉంటుంది. ఇప్పటి వరకు 15,283 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయగా 5,238 మంది రైతుల వ్యక్తిగత ఖాతాల్లో రూ. 54.57 కోట్లు జమ చేశారు. మద్దతు ధర క్వింటాల్కు రూ.1960, కామన్ రకానికి గానూ రూ.1940 ప్రభుత్వం చెల్లిస్తున్నది. 221 మహిళా కేంద్రాల్లో 76,111 మెట్రిక్ టన్నులు, సహకార సంఘాల్లో 173 కేంద్రాల ద్వారా 72,715 మెట్రిక్ టన్నుల ధాన్యం, మార్కెట్ కమిటీల ద్వారా ఏడు కేంద్రాల నుంచి 4,960 మెట్రిక్ టన్నులు, మెప్మా ద్వారా ఐదు కేంద్రాల నుంచి 2,790 మెట్రిక్ టన్నుల ధాన్యం మొత్తం 1,56,577 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంది. గురువారం వరకు మహిళా సంఘాలు, సహకార సంఘాలు, మార్కెట్ కమిటీలు కొనుగోలు చేసిన 73,101 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్మిల్లులకు చేర్చారు. 42,650 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి ట్రక్ షీట్ను ఇచ్చారు.
జిల్లాలో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం
జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతుల ముంగిటనే కొనుగోలు కేంద్రాలు ఉండడంతో నేరుగా పొలం నుంచి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. ఈ యాసంగిలో జిల్లాలో 2,62,277 ఎకరాల్లో వరి సాగైంది. 6,55,692 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీనిలో స్థానిక అవసరాలకుగానూ 55, 962 మెట్రిక్ టన్నుల ధాన్యం పోగా, మిగిలిన ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి గ్రామాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా కొంటున్నది. ఎక్కడ చూసినా ధాన్యం రాశులతో గ్రామాలు కనిపిస్తున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగవద్దనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించి రెండు మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు.
ఇబ్బందులు తప్పాయి
యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకున్నా సీఎం కేసీఆర్ ముందుకొచ్చి కొనుగోలు చేయించడం చాలా సంతోషకరం. గతంలో దుబ్బాక మార్కెట్ యార్డులో రోజుల తరబడి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు తప్పాయి.
– యాదయ్య, రైతు దుబ్బాక
సీఎం కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు
యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకుండా కొర్రీలు పెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారు యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయించడం సంతోషకరం. సీఎం కేసీఆర్ సారును రైతులు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. సారుకు రైతుల తరపున కృతజ్ఞతలు.
–ఆంజనేయులు, రైతు మిరుదొడ్డి
3 రోజులకే డబ్బులు వచ్చినయి
హుస్నాబాద్టౌన్, మే 19: మూడువందలకు పైగా ధాన్యం బస్తాలు బస్డిపో కేంద్రం దగ్గర పోసిన. వడ్లు పట్టిన వెంటనే బస్తాల్లో నింపింగానే తూకం వేసిండ్రు. మూడురోజులకే డబ్బులు బ్యాంకు ఖాతాలో పడ్డయి. ఇబ్బందులు ఏమీకాలే. పోయినసారిలెక్కనే పైసలు తొందరనే వస్తున్నయి.
– అయిలేని సంజీవరెడ్డి, రైతు, హుస్నాబాద్ టౌన్
రైతులను ఆదుకున్న దేవుడు
రైతులను ఆదుకున్న దేవుడు సీఎం కేసీఆర్ … కేంద్రం వడ్లు కొనకున్నా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం అభినందనీయం. దళారులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొచ్చి విక్రయించా. ముందు వడ్లు కొనరని రంది పడ్డాం.. సీఎం కేసీఆర్ సారు ముందుకు వచ్చి వడ్లు కొనడం సంతోషంగా ఉన్నది
–చింతల రాజు, రైతు, గుర్రాలగొంది