సిద్దిపేట, మార్చి 22 : శ్రీశోభకృత్ నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కాన్ఫరెన్స్లో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి జడ్పీటీసీలు, ఎంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, కో-ఆపరేట్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఆత్మ కమిటీ చైర్మన్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లకు, రైతుబంధు మండల గ్రామ శాఖ కో -ఆర్డినేటర్లకు, మండల, గ్రామాల అధ్యక్షుడు, అనుబంధ సంఘాల అధ్యక్షుడు, పట్టణ కౌన్సిలర్లు, వార్డుల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మహిళ, యూత్, విద్యార్థి, సోషల్ మీడియా, ముఖ్య సీనియర్ నాయకులకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు ఉగాది పచ్చడిలాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలన్నారు. తెలుగు వారి సాంప్రదాయాలకు ప్రతిరూపమైన ఉగాది శోభకృత్లో అంతా శోభాయమానంగా విరజిల్లాలన్నారు. అందరికీ శుభం చేకూరాలి.. మీ లక్ష్యం నెరవేరాలి.. తాగు సాగునీటితో సఫలమై రైతుల ఇంట పసిడి సిరులతో నిత్య శోభాయమానం వెల్లివిరుస్తుందంటే అది 9 ఏండ్ల తెలంగాణ రాష్ట్ర ప్రగతి సఫలమన్నారు. త్వరలో బీఆర్ఎస్ గ్రామగ్రామాన ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకోబోతున్నామన్నారు. జెండా భుజాన వేసుకొని 21 ఏండ్లు పార్టీని కాపాడుకుంటున్న సైనికులు మీరన్నారు.
సిద్దిపేట నాడు పార్టీ ఆవిర్భావం.. ఉద్యమం నుంచి నేటి అభివృద్ధి ప్రగతి వరకు అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. నాడు ఉద్యమంలో ఎంత పట్టుదలతో ఉన్నామో నేడు అభివృద్ధిలో అంతే పంథాతో చేసుకున్నామన్నారు. అందులో మీ కృషి.. మీ భాగస్వామ్యం ఎన్నటికీ మరువలేమన్నారు. రాదు అనుకున్న రాష్ర్టాన్ని సాధించుకున్నాం.. కాదు అన్న కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకున్నాం.. స్వరాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధుల్లా పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి.. నాకు మీరే బలం.. బలగం.. అందరం కలిసి గ్రామగ్రామాన.. పట్టణంలో అట్టహాసంగా ఆత్మీయసమ్మేళనాలు చేసుకుందామన్నారు. త్వరలోనే తేదీలు గ్రామాల వారిగా షెడ్యూల్ చేసుకొని కార్యక్రమాన్ని అద్భుతంగా చేసుకుందామన్నారు.
9 ఏండ్ల కింద మన రాష్ట్రం.. మన సిద్దిపేట.. 9 ఏండ్ల తర్వాత మన రాష్ట్రం.. మన సిద్దిపేట ఏంది అనేది ప్రజల్లో ఒక్కసారి మనం వివరించాల్సిన అవసరం మనపై ఉందన్నారు. కరువు కాటకాలతో అల్లాడిన మన ప్రాంతం కల్పతరువుగా మారిందన్నారు. సిద్దిపేటకు ఒక ట్యాగ్లైన్ ఉండే సిద్దిపేట జిల్లా… గోదావరి జలాలు.. రైలు.. జిల్లా ఏర్పడి అద్భుత ప్రగతి పరిపాలన సాగిస్తున్నామన్నారు. గోదావరి జలాలు తెచ్చి మండుటెండల్లో చెరువులు, చెక్డ్యాంలు మత్తళ్లు దుంకుతున్నాయన్నారు. త్వరలోనూ రైలు రాబోతుందన్నారు. ఇవన్నీ కల కాదు .. మన కళ్ల ముందు కనబడుతున్నాయన్నారు.
నాడు కరెంటు ఉండేది కాదు.. ఎప్పుడు వస్తదో తెలియని పరిస్థితి.. రాత్రి పూట పొలం కాడికి బోరు వేయడానికి పోతే పాముల భయం.. మనిషి చనిపోతే ఊరిలో ట్రాన్స్ఫార్మర్ కరాబై నీళ్లు లేని పరిస్థితి స్వయంగా నాకే ఫోన్లు వచ్చేవి. కానీ నేడు ఇరామ్లేని 24 గంటల కరెంట్.. రైతులు రెండు పంటలు పండించేలా పుష్కలంగా నీళ్లు.. నేడు కండ్ల ముందు కనబడుతున్నాయన్నారు. రైతుబీమా, రైతుబంధు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆరోగ్య మహిళ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకొని దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు. ఇది మనం ప్రజల్లోకి తీసుకెళ్లే గొప్ప బాధ్యత మీ పై ఉందన్నారు. మన పార్టీ సభ్యత్వం లక్ష వరకు చేసుకున్నామన్నారు.
ఈ ఆత్మీయ సమ్మేళనంలో సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయాలన్నారు. ఆయిల్పామ్ సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోనే ఆయిల్పామ్ ఫ్యాక్టరీ అయ్యింది.. దానిని మనం సద్వినియోగం చేయాలంటే మనం సాగులో ముందుండాలన్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. రాష్ట్రంలో 85 లక్షల మందికి పరీక్షలు పూర్తయ్యాయన్నారు. నియోజకవర్గంలో 33 గ్రామాలు సిద్దిపేట పట్టణంలో 29 వార్డుల్లో 75 వేల మందికి పరీక్షలు పూర్తయ్యాయన్నారు.