Palm Oil | ఆయిల్పామ్ సాగుకు సిద్దిపేట జిల్లా అడ్డాగా మారుతున్నది. సర్కారు ఇస్తున్న సబ్సిడీలు, ప్రోత్సాహంతో పాటు మార్కెట్లో పంటకు మంచి డిమాండ్ ఉండడంతో సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించడంతో భవిష్యత్లో పంట విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది.
రాష్ట్రంలో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల తర్వాత రైతులు అత్యధికంగా పంటను సాగుచేస్తున్నది ఇక్కడే. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడం, ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రత్యేక చొరవతో అధికారులు రైతులను ప్రోత్సహించారు. గతేడాది 4,200 ఎకరాలు, ఈ ఏడాది 2,800 ఎకరాల్లో ఆయిల్పామ్ మొక్కలు నాటగా, మరో 1300 ఎకరాలకు డ్రిప్ డీడీలు కట్టి సాగుకు సిద్ధం చేశారు. సిద్దిపేట జిల్లాలోని నర్మెటలో రూ.300 కోట్లతో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతున్నది. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోనూ అన్నదాతలకు అవగాహన కల్పించి, సాగుచేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి హరీశ్రావు ఆదేశాలు ఇవ్వడంతో ఆ దిశగా అధికారులు చర్యలు వేగవంతం చేశారు.
సిద్దిపేట, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లా ఆయిల్పామ్ అడ్డాగా మారుతున్నది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తున్నది. ఇటీవల బడ్జెట్లో రూ 1000 కోట్లు కేటాయించడంతో రైతులు సాగుకు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల తర్వాత కొత్తగా సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా సాగుచేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో ఈ రెండు ఏండ్లలోనే 7 వేల ఎకరాలు సాగుచేశారు. గత ఏడాది 4,200 ఎకరాలు, ఈ ఏడాది 2,800 ఎకరాలు నాటారు. మరో 1300 ఎకరాలకు డ్రిప్ డీడీలు కట్టి సాగుకు సిద్ధం చేశారు. జిల్లాలో 6 వేల ఎకరాలకు కావాల్సిన మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు నెలల్లో సాధ్యమైనంత వరకు నాటించాలనే దృఢ సంకల్పంతో జిల్లా యంత్రాంగం ఉంది. జిల్లాలోని నర్మెట గ్రామంలో రూ.300 కోట్లతో ఆయిల్పామ్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. ఇక రాష్ట్రంలోని మిగతా జిల్లాలో ఈ రెండేండ్ల కాలంలో 5 వేల ఎకరాల వరకు సాగైంది. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా కావడంతో రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రత్యేక చొరవ తీసుకోవడంతోపాటు నిరంతరం సమీక్షా సమావేశాలను నిర్వహించి ఆయిల్పామ్ సాగు చేసేలా రైతులను ప్రోత్సహించారు. అలాగే మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోనూ పంట వేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని పలు సందర్భాల్లో ఉద్యానవనశాఖ అధికారు లకు మంత్రి ఆదేశాలివ్వడంతో ఆ దిశగా ప్రణాళికలు తయారు చేస్తున్నది.
సిద్దిపేట జిల్లాలో ఆయిల్పామ్ సాగుపై గ్రామాల్లో ఉద్యానవన, వ్యవసాయశాఖలు సంయుక్తంగా అవగాహన కల్పిస్తున్నారు. ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైన వాతావరణం, మంచి భూములు ఉండడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో రంగనాయక, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజరాయర్లు నిర్మించారు. వీటి ద్వారా పుష్కలమైన సాగునీరు రైతుల పొలాలకు అందుతున్నది. మండుటెండల్లో సైతం చెరువులు, కుంటలు నీటితో తొణికిసలాడుతున్నాయి. సాగునీటికి ఢోకా లేకుండాపోయింది. భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. దీంతో ఎక్కువ మొత్తంలో రైతులు సాగుకు ముందుకు వస్తున్నారు.
ఆయిల్ పామ్ మొక్కలు నాటడానికి ప్రస్తుత సమయం అనుకూలం కావడంతో రైతులతో మొక్కలు నాటించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రణాళికలను సిద్ధం చేశారు. ఆయి ల్ పామ్ సాగుతో లాభాలు, దిగుబడి, ఇతర పంటలతో పోల్చితే ఈ పంటలో ఉన్న లాభాలు ఏంటో వివరిస్తున్నారు. జిల్లాలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద ఆయిల్ పామ్ నర్సరీ, జగదేవ్పూర్ మండలం ఎల్లాయిగూడ నర్సరీ, ములుగులో నర్సరీలను ఏర్పాటు చేశారు. వీటన్నింటిలో కలిపి ప్రస్తుతం సుమారు 6 వేల ఎకరాలకు సరిపడా మొక్కలు సిద్ధం చేశారు. రైతుల అవసరాల మేరకు మొక్కలు అందించడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉన్నది. గ్రామాల్లో అయిల్ పామ్ సాగు చేసే రైతుల వివరాలను నమోదు చేసుకొని వారికి కావాల్సిన బిందుసేద్యం పరికరాలను వెనువెంటనే అందించి రైతుల పొలంలో బిగిస్తున్నారు.
సంప్రదాయ నూనె గింజల ఆయిల్ పామ్ పంట నూనె దిగుబడి 4 నుంచి 5 రెట్లు అధికంగా ఉంటుంది. మొక్కలు నాటిన తర్వాత నాలుగో సంవత్సరం నుంచి కాపు మొదలై 30 సంవత్సరాల వరకు నిరంతర దిగుబడితో నిరంతర ఆదాయం వస్తున్నది. తెగుళ్లు, చీడపీడలు ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్లో చాలా తక్కువ. ఈ పంట తుఫాన్, వడగండ్ల వానలు ప్రకృతి వైఫరిత్యాలను సమర్థంగా తట్టుకుంటుంది. కోతుల బెడద, అడవి పందుల బెడద ఉండదు. ఆయిల్ పామ్ సాగులో ఖర్చు చాలా తక్కువ, కూలీల అవసరం చాలా తక్కువ ఉంటుంది. ఒక రైతు సుమారు 10 ఎకరాల ఆయిల్ పామ్ తోటను పర్యవేక్షణ చేయవచ్చు. ఇతర పంటల మాదిరి ధాన్యాన్ని ఆరబెట్టడం, తూర్పారబట్టడం, తేమశాతం నిలవడం లాంటి సమస్యలు ఆయిల్ పామ్లో లేవు. దళారీ వ్యవస్థ అసలే ఉండదు.
రైతు గెలలను కోసిన తర్వాత నేరుగా ఫ్యాక్టరీకి తరలించి మూడు రోజుల్లో గెలలు, రవాణా చార్జిలు పొందే అవకాశం ఉంటుంది. ఆయిల్ పామ్ సాగుతో నిరంతర దిగుబడి, ఆదాయంతో రైతుల ఆర్థిక పురోగతి, అత్యున్నత శక్తి చేరుకొని రైతు మాత్రమే కాకుండా రైతు భావితరాలు కూడా ఆయిల్ పామ్ లబ్ది పొందే అవకాశం ఉంటుంది. ఆయిల్ పామ్ సాగు చేయడంతో నిరంతర దిగుబడి వచ్చి రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాడు. ఇతర పంటలో పొలిస్తే ఖర్చుల పోను అయిల్పామ్ సాగుతో ఏడాదికి ఎకరాకు నికరంగా రూ.1,00,000 ఆదాయం మిగులుతుంది. మొదటి మూడు సంవత్సరాలు ఆదాయం కోసం అంతర పంటలుగా కూరగాయలు, మొక్కజొన్న ,పత్తి ,బొబ్బర్లు, పెసర్లు, కందులు ఉలువలు, పొద్దుతిరుగుడు, అరటి, బొప్పాయి, వేరుశనగ లాంటి పంటలు పండించవచ్చు. ఐదు సంవత్సరాల తర్వాత కూడా కోకో, పొట్టి మిరియాలు తదితర పంటలను అంతర సేద్యంగా సాగుచేయడం ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది.
1) ఆయిల్ పామ్ గెలలను కొనుగోలు చేసే సంస్థ : ఆయిల్ఫెడ్ (ఆయిల్ పామ్ చట్టం 1993 ప్రకారం)
2) గెలలు కొనుగోలు : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలోని ఫ్యాక్టరీలో
3) గెలల ధరలు : ప్రతినెలా నిబంధనల ప్రకారం రాష్ట్ర ఉద్యానవనశాఖ, ఆయిల్ఫెడ్ ధరలు నిర్ణయిస్తాయి. రైతు ప్రతినిధుల సమక్షంలో గెలల ధరను నిర్ణయిస్తారు.
4) గెలల డబ్బులు, రవాణా చార్జీలు : ప్రతి వారంలో 2 సార్లు, సోమ, గురువారాల్లో
5) ఇతర మార్కెటింగ్ సదుపాయాలు : ఫ్యాక్టరీకి దూర ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు రైతు ఫోన్కు మెసేజ్ సౌకర్యం
ఆయిల్ పామ్ సాగులో అంతర పంటలను పరిశీలిస్తున్న వ్యవసాయాధికారులు