సంగారెడ్డి కలెక్టరేట్, మే 15 : ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ ప్రజావాణికి అర్జీలు వెల్లువెత్తాయి. ఆయా అర్జీలను కలెక్టర్ డాక్టర్ శరత్ స్వీకరించారు. మొత్తం 42 అర్జీలు అందగా, అందులో 12 అర్జీలు రెవెన్యూ శాఖకు సంబంధించినవి కాగా, మిగతా 30 అర్జీలు వివిధ శాఖలకు సంబంధించి ఉన్నాయి. ఆయా అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తూ వాటిని పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం చేయ డం సరికాదన్నారు.
అన్ని శాఖల అధికారులు ప్రజావాణిలో తమ శాఖకు సంబంధించి వచ్చిన అర్జీలు, పరిష్కరించినవి, పెండింగ్లో ఉన్న వివరాలను సంబంధిత రిజిష్టర్లలో అప్డేట్ చేయాలని సూచించారు. ప్రజావాణికి సంబంధించి నిర్దేశించిన రిజిష్టర్లను తప్పనిసరిగా నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తమకు రేషన్ కమీషన్ పెంచేందుకు కృషి చేయాలని జిల్లా రేషన్ డీలర్ల జేఏసీ నాయకులు కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవోలు, కలెక్టరేట్ ఏవో, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.