ధరణి పైలట్ ప్రాజెక్టు వందశాతం సక్సెస్
రెవెన్యూ సదస్సులతో భూసమస్యల పరిష్కారం
మండలాల వారీగా కమిటీలు వేసుకోవాలి
భూసమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి..
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్
రెవెన్యూ సదస్సుల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్
సదస్సులను విజయవంతం చేయాలి : కలెక్టర్
సిద్దిపేట అర్బన్, జూలై 8 : ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించి, భూసంబంధ సమస్యలను పరిష్కరించాలని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్కుమార్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భూసమస్యల పరిష్కారానికి జూన్ 14న ములుగు మండల కేంద్రంలో చేపట్టిన ‘ధరణి పైలట్ ప్రాజెక్టు’ విజయవంతమైందన్నారు.
ఆ గ్రామంలోని భూసంబంధ సమస్యలు పరిష్కారమైనట్లు తెలిపారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా గల భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ అధికారులు మండలాల వారీగా సీనియర్ రెవెన్యూ అధికారులతో కమిటీలు వేసుకోవాలన్నారు. గ్రామాల వారీగా తేదీలను ముందస్తుగా ప్రకటించి, మూడు రోజులకు ఒక మండలం చొప్పున రెవెన్యూ సమస్యలపై అర్జీలను స్వీకరించి, వాటిని పరిష్కరించి, భూ సమస్యలు లేని రాష్ట్రంగా నిలపాలన్నారు. రెవెన్యూ సదస్సులు నిర్వహించే గ్రామాల్లో ముందస్తుగా రెవెన్యూ సదస్సు నిర్వహించే తేదీలను దండోరా వేయించి ప్రజలకు తెలపాలన్నారు. దరఖాస్తు చేసుకునే విధానం, కావాల్సిన డాక్యుమెంట్ల గురించి వివరించాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజలకు అందుబాటులో ఉండే ఫంక్షన్హాళ్లలో దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ఆ కేంద్రంలో తాత్కాలికంగా మీ సేవ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ములుగులో భూసమస్యల పరిష్కారానికి చేసిన విధంగా సంబంధిత వివరాలు, సమస్యలను గుర్తించాలన్నారు. అవసరమైన ధ్రువపత్రాలతో ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. సంబంధిత భూ యజమానులకు సమస్య వివరించి, గ్రామాల వారీగా ప్రజల సమక్షంలో పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. వీసీలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జూన్ 14వ తేదీన మంత్రి హరీశ్రావు, సీఎస్ సోమేశ్కుమార్ సమక్షంలో పైలట్ ప్రాజెక్ట్గా ములుగు గ్రామపంచాయతీలో భూ సమస్యల పరిష్కారానికి అంకురార్పణ జరిగిందని, ముందస్తు ప్రణాళికతో సంబంధిత భూ సమస్యలను గుర్తించి విజయవంతంగా పరిష్కరించామన్నారు. అదే స్ఫూర్తితో జిల్లాలో అదనపు కలెక్టర్లు, సీనియర్ రెవెన్యూ అధికారులతో నాలుగు బృందాలుగా ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో గల భూసమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సదస్సులను విజయవంతం చేయాలి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులను అధికారులు విజయవంతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ రెవెన్యూ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. దరఖాస్తుల స్వీకరణ కేంద్రాల్లో గ్రామాల వారీగా ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆయా మండలాలతో పాటు పరిసర మండలాల మీ సేవ కేంద్రాల సేవలను రెవెన్యూ సదస్సుల్లో వినియోగించాలని, ఇంటర్నెట్ కనెక్షన్, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని సూచించారు. ప్రజలు గుర్తించేలా రెవెన్యూ అధికారులు గుర్తింపు కార్డులు ధరించాలని, ఈ సదస్సులు ద్వారా పరిష్కరించబడే అంశాలపై గ్రామ పంచాయతీల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ముజామ్మిల్ఖాన్, శ్రీనివాస్రెడ్డి, డీఆర్ఎస్ చెన్నయ్య, ఆర్డీవోలు అనంతరెడ్డి, విజయేందర్రెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు.