జిన్నారం, ఫిబ్రవరి 5: ప్రతి విద్యార్థి జీవితంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత కీలకమని, ఇష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం జిన్నారం మండలం గడ్డపోతారంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సహకారంతో జిన్నారం, గుమ్మడిదల మండలాలతోపాటు బొల్లారం మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మానసిక వ్యక్తిత్వ నిపుణుడు డాక్టర్ సతీశ్తో మోటివేషనల్ తరగతులు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సొంత నిధులతో కొనుగోలు చేసిన స్టడీ మెటీరియల్, పరీక్షా ప్యాడ్లు, పెన్నులను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వం విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 1000కి పైగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి పేదవిద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించారని తెలిపారు. పరీక్షలు పూర్తయ్యే వరకు విద్యార్థులంతా మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పూర్తి సహకారం అందించాలని కోరారు. పదో తరగతి ఫలితాలపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అనంతరం వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ పూర్ణ కృష్ణ, సోను, ప్రసన్న కుమార్, ఎంఈవో రాథోడ్ ఒత్తిడిని అధిగమించే మెళకువలను విద్యార్థులకు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్చైర్మన్ ప్రభాకర్, గుమ్మడిదల జడ్పీటీసీ కుమార్ గౌడ్, ఎంఈవో జెమినీ కుమారి, సీనియర్ నాయకులు విజయభాసర్ రెడ్డి, వెంకటేశ్ గౌడ్, ప్రజాప్రతినిధులు, విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు.