తెలంగాణ ప్రభుత్వం మారుమూల పల్లె నుంచి జిల్లా కేంద్రం వరకు రోడ్ల విస్తరణ, కొత్త రోడ్లు నిర్మించి రవాణా సౌకర్యం మెరుగుపరుస్తుండగా, బీజేపీ సర్కారు మాత్రం జాతీయ రహదారుల నిర్మాణంలో రాష్ట్రంపై వివక్ష చూపిస్తున్నది. వికారాబాద్-తాండూర్-జహీరాబాద్-బీదర్ 133.9 కిలోమీటర్ల రోడ్డును నేషనల్ హైవేగా అభివృద్ధి చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రతిపాదనలు పంపినా ఇప్పటి వరకు స్పందించకపోవడంతో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా జహీరాబాద్లో నిమ్జ్ను ప్రకటించడంతో అనేక పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. ఈ క్రమంలో 50 కిలోమీటర్లు ఉన్న జహీరాబాద్-బీదర్ రోడ్డుపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. సిద్దివినాయక, కేతకీ సంగమేశ్వర్ వంటి ప్రముఖ ఆలయాలు ఈ రహదారికి సమీపంలో ఉండడంతో ఏటా రద్దీ పెరుగుతున్నది. ప్రస్తుతం రెండు లేన్ల ఆర్అండ్బీ రోడ్డుతో వాహనదారులు, ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కేంద్రం నిర్లక్ష్యం వీడి తెలంగాణ-మహారాష్ట్ర – కర్ణాటక రాష్ర్టాలకు అనుసంధానంగా నాలుగు లేన్లతో నేషనల్ హైవేని నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
జహీరాబాద్, ఏప్రిల్ 7: మన్నెగూడ (ఎన్హెచ్-163) నుంచి వికారాబాద్-తాండూర్-జహీరాబాద్-బీదర్ (ఎన్హెచ్-50) వరకు జాతీయ రహదారి నిర్మాణంపై కేంద్రంలోని మోదీ సర్కారు విక్షక్ష చూపుతోంది. జహీరాబాద్-బీదర్ రహదారి 50 కిలోమీటర్లు ఉంటుంది. వికారాబాద్-తాండూర్-జహీరాబాద్-బీదర్ 133.9 కిల్లోమీటర్ల పొడువు ఉంది.
అభివృద్ధికి కేంద్రం మోకాలడ్డు…
జహీరాబాద్ పట్టణం ఇండస్ట్రియల్ హబ్గా ఎంతో అభివృద్ధి చెందుతున్నది. ఇప్పటికే కొన్ని పరిశ్రమల వారు భూములు తీసుకొని ఫ్యాక్టరీలు నిర్మాణం చేసేందుకు భూమిపూజ చేశారు. జహీరాబాద్-బీదర్ రోడ్డుకు సమీపంలో సిద్దివినాయక, కేతకీ సంగమేశ్వర్ ఆలయాలున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన భక్తులు ప్రతిరోజు ఈ ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వస్తారు. 65వ జాతీయ రహదారి నుంచి ప్రతిరోజు బీదర్, నాందేడ్కు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. జహీరాబాద్లో జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలి (నిమ్జ్)ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది.
ఝరాసంగం-న్యాల్కల్ మండలంలో నిమ్జ్ ఏర్పాటుచేసేందుకు భూసేకరణ చేస్తున్నారు. బీదర్-జహీరాబాద్ రోడ్డు నిమ్జ్ మధ్యలో నుంచి ఉంది. రెండు లైన్లు రోడ్డు ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారిగా గుర్తించి నాలుగు లైన్లుగా నిర్మాణం చేయాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిరోజు ఈ రోడ్డు వెంట లారీలు, ఆర్టీసీ బస్సులు, కార్లు, ఇతర వాహనాలు తిరుగుతాయి. జహీరాబాద్ నుంచి నాందేడ్ వరకు వ్యాపారులు, ప్రజలు ప్రతిరోజు రాకపోకలు సాగిస్తారు. రోడ్డు సక్రమంగా లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రముఖ ప్రైవేటు కంపెనీల్లో ఉత్పత్తి చేసే వాహనాలను వివిధ రాష్ర్టాలకు తరలించేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డును జాతీయ రహదారిగా నిర్మాణం చేస్తే వాహనదారులకు, వ్యాపారులకు ఎంతో మేలు కలుగుతుంది.
ప్రతిపాదనలు, లేఖలు బుట్టదాఖలు…
తెలంగాణ-కర్ణాటక, మహారాష్ట్రలను కలుపుతూ ఉన్న తాండూరు, జహీరాబాద్, బీదర్-నాందేడ్ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించాలని ఎంపీ బీబీ పాటిల్ పలుమార్లు కేంద్రానికి లేఖ రాసినా స్పందించడం లేదు. 2015 నుంచి జహీరాబాద్-బీదర్ రోడ్డు ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి. రోడ్డును జాతీయ రహదారిగా అప్గ్రేడ్ చేయాలని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ అధికారులు 8 ఏండ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కేంద్రం జాతీయ రహదారిగా గుర్తించకుండా, పెండింగ్లో పెట్టింది. గత ఏడాది జాతీయ రహదారిగా ప్రతిపాదనలు పంపించినా స్పందించకపోగా, కనీసం మరమ్మతులు చేయడంలేదు. రోడ్డుపై ఎక్కడ చూసినా గుంతలు పడి ఉన్నాయి. దీంతో ప్రజాప్రతినిధులు పలుమార్లు అధికారులకు దృష్టికి తీసుకుపోయి రోడ్డు మరమ్మతులు చేసేందుకు కృషి చేశారు.
జాతీయ రహదారిగా గుర్తించాలి
తెలంగాణ, కర్ణాటక, మహా రాష్ట్రలకు అనుసంధానం చేసేందుకు జహీరాబాద్-బీదర్ రోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. ప్రజాప్రతినిధులు పలుమార్లు లేఖలు రాశారు. రాష్ట్ర సర్కారు పంపిన ప్రతిపాదనలను బీజేపీ ప్రభుత్వం మూలన పడేసింది. నిధులు మంజూరు చేయడం లేదు. జహీరాబాద్లో భారీ పరిశ్రమలు వెలుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిమ్జ్ ఏర్పాటు చేస్తున్నది. బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఈ రోడ్డుకు జాతీయ రహదారిగా గుర్తింపు రావడం లేదు. నాలుగు లైన్లుగా నిర్మించి, జాతీయ రహదారిగా గుర్తిస్తే ఎంతో మంది వాహనదారులకు మేలు కలుగుతుంది. – మల్కాపూరం శివకుమార్,
డీసీఎంఎస్ చైర్మన్, ఉమ్మడి మెదక్ జిల్లా