నర్సాపూర్, ఫిబ్రవరి 6: నర్సాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కనపడుతుందని, మీ చేసిన అభివృద్ధి పనులు చూపించాలని బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సవాల్ విసిరారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలోని 10, 11, 12 వార్డుల్లో శుక్రవారం ఆమె బీఆర్ఎస్ అభ్యర్థులు కండెల(బుల్లెట్) రాజు, తొంట వినయ్కుమార్, సమీనా బేగం తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ బాకీ కార్డు చూపుతూ కారుగుర్తుకు ఓటువేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఇంటింటికీ మిషన్భగీరథ నీళ్లు, ఆర్టీసీ బస్డిపో, రూ.12 కోట్లతో వాటర్ ట్యాంకులు, చెరువు పునరుద్ధరణ, వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్, మున్సిపల్ భవ నం, దోబీగాట్, అర్బన్పార్క్, ఈద్గాల అభివృద్ధి, సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్, స్మశాన వాటికకు 5 ఎకరాల స్థలం, 4లైన్ల రోడ్డు, డివైడర్లు, సెక్రిగేషన్ షెడ్ తదితర అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్బెడ్ రూమ్లు, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, ఎస్సీ, బీసీ కమ్యూనిటీహాల్ను ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని మండిపడ్డారు. మున్సిపాలిటీ, నర్సాపూర్ డివిజన్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం నర్సాపూర్ మున్సిపాలిటీకి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం నయా పైసా కూడా మున్సిపల్ అభివృద్ధికి నిధులు విడుదల చేయలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు, 420 హామీలు నెరవేరుస్తామని మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ఇచ్చిన పథకాలకు రెట్టింపు ఇస్తామని మాయమాటలు చెప్పి నేడు అధికారంలోకి వచ్చి జనాలను నట్టేట ముంచారని ఎద్దేవా చేశారు. మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం అని చెప్పి నేడు పురుషులకు బస్సు చార్జీలు పెంచారని గుర్తుచేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సంతోష్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ అశోక్గౌడ్, జడ్సీ కో-ఆప్షన్ మాజీ సభ్యుడు మన్సూర్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, బీఆర్ఎస్ నాయకులు నాగరాజుగౌడ్, శ్రవణ్కుమార్, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.