మెదక్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి.. మరొకరు సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి. ఒకప్పుడు వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండేవి. మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఎమ్మెల్యే హోదాలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటే.. మరోవైపు ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి మరో కార్యక్రమంలో పాల్గొనేవారు. వీరిద్దరి మధ్య రాజకీయ విభేదాలు తారస్థాయిలో ఉండేవి. బీఆర్ఎస్లో ఉంటూనే ఎడమొహం, పెడమోహంగా ఉన్నారు. రెండేండ్లుగా మెదక్ నియోజకవర్గం లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ తనకే ఎమ్మెల్యే టిక్కె ట్ వస్తుందని ఆశపడ్డారు ఎమ్మెల్సీ సుభాష్రెడ్డి.
అయితే, బీఆర్ఎస్ అధిష్ఠానం సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కే టికెట్ కేటాయించింది. టికెట్ ఆశించి భంగపడ్డ అసంతృప్తులతో ఉన్నవారితో మాట్లాడి, కలిసికట్టుగా ప్రచారం చేయాలని సీఎం కేసీఆర్ సూచించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మెదక్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుస్తూ తనను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దసరా పండుగ సందర్భంగా హవేళీఘనపూర్ మండలం కూచన్పల్లిలోని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి ఫాంహౌస్కు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి వెళ్లి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరు కలిసికట్టుగా పని చేస్తే బీఆర్ఎస్లో జోష్ పెరుగుతుందని కార్యకర్తలు అంటున్నారు. దీంతోపాటు పద్మాదేవేందర్రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.