వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో శుక్రవారం మోస్తరు వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలో 27.4 మి.మీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 23.629 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నల్లవాగు, నారింజ ప్రాజెక్టులు నిండిపోయాయి. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. జిల్లాలో పదికిలోమీటర్ల మేర రహదారులు, 20 వరకు కల్వర్టులు దెబ్బతినగా ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖలు మరమ్మతులు చేపడుతున్నాయి. 900 ఎకరాల్లో సోయాబీన్, పత్తి, కంది, చెరుకు, పెసర, మినుము పంటలు నీట మునిగాయి. మెదక్ జిల్లాలో 30.9 మి.మీ వర్షపాతం నమోదవగా, అత్యధికంగా నిజాంపేట్ మండలంలో 45.4 మి.మీ కురిసింది. 2275 చెరువుల్లో 1669 అలుగు పారుతున్నాయి. 816 ఇండ్లు పాక్షికంగా దెబ్బతినగా,17 ఇండ్లు పూర్తిగా కూలిపోయాయి. మరోవైపు భారీ వర్షాలతో వానకాలం సీజన్ వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. అన్ని చోట్లా రైతులు వరినాట్లు వేస్తున్నారు. ఆగస్టు మొదటి వారం వరకు నాట్లు వేసుకునేందుకు అవకాశముందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
-సంగారెడ్డి/మెదక్ న్యూస్ నెట్వర్క్, జూలై 28
మెదక్, జూలై 28 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో వారం రోజుల్లో 30.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నిజాంపేట్ మండలంలో 45.4 మి.మీ, అత్యల్పంగా మనోహరాబాద్ మండలంలో 13.3 మి.మీ వర్షపాతం నమోదైంది. రామాయంపేటలో 39.1 మి.మీ, పాపన్నపేట 38.7, అల్లాదుర్గం 37.3, పెద్దశంకరంపేట 37.9, టేక్మాల్ 36.6, హవేళీఘనపూర్ 36.4, మెదక్ 35.8, కౌడిపల్లి 32.6, రేగోడ్ 31.5, చిన్నశంకరంపేట 32.4, చేగుంట 31.4, నార్సింగి 27.3, కొల్చారం 28.7, వెల్దుర్తి 27.6, మాసాయిపేట 24.3, నర్సాపూర్ 29.5, శివ్వంపేట 24.6 మి.మీల వర్షం కురిసిందని ప్రణాళిక శాఖ అధికారులు తెలిపారు.
జోరందుకున్న వరి నాట్లు
మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరి సాగు జోరందుకున్నది. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల పరిధిలో రైతులు నాట్లు వేస్తున్నారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉండడం, నారు మడి సైతం పెరగడంతో ముమ్మరంగా నాట్లు వేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అవసరానికి కూలి ఎక్కువగా ఇచ్చి కూడా నాట్లేయిస్తున్నారు. దీంతో జిల్లాలో ఈ వానకాలంలో వరి సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఆగస్టు మొదటి వారం వరకు కూడా నాట్లు వేసే అవకాశం ఉన్నదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
అలుగు పారుతున్న చెరువులు
మెదక్ జిల్లా వ్యాప్తంగా 2275 చెరువులు ఉండగా, 1669 చెరువులు అలుగు పారుతున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిస్తే జిల్లాలోని చెరువులన్నీ నిండనున్నాయి. 559 చెరువులు వంద శాతం నిండగా, 47 చెరువులు 50 నుంచి 75 శాతం నిండాయని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ చెరువులకు గండ్లు పడితే సమాచారం ఇవ్వాలని రైతులకు సూచిస్తున్నారు. చెరువులు, వాగుల్లోకి వరద చేరుతుండడంతో ప్రజలు, మత్స్యకారులు వాటి వద్దకు వెళ్లకూడదని తెలిపారు.
మెదక్ ఎమ్మెల్యే, కలెక్టర్ పర్యవేక్షణ
మెదక్ జిల్లాలో నెలకొన్న పరిస్థితులను ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహించి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. మెదక్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ఉన్న గ్రామాల్లో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పర్యటిస్తూ ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. అన్ని వాగులు, బ్రిడ్జిల వద్ద రెవెన్యూ, పోలీసులు కాపలా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, కల్వర్టులు కొట్టుకుపోతున్నాయని, వాటిని దాటవద్దని ప్రజలకు సూచిస్తున్నారు. మెదక్ మండలం తిమ్మానగర్ గ్రామంలో వరద ప్రవహించి రోడ్డు కొట్టుకుపోవడంతో ఎమ్మెల్యే రోడ్డును పరిశీలించారు. వెంటనే చర్యలు చేపట్టాలని ఆర్అండ్బీ డీఈ వెంకటేశానికి ఎమ్మెల్యే సూచించారు.
భారీ వర్షాల నుంచి ప్రజలకు ఊరట లభించింది. బుధ, గురు వారాల్లో జోరుగా వర్షం కురవగా, శుక్రవారం తెరిపినిచ్చింది. అక్కడక్కడ చిరు జల్లుల నుంచి మోస్తరు వర్షం కురిసింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. ప్రధాన ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. జిల్లాలోని పలు చోట్ల రోడ్లపై నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు, రైతులు ఊరట చెందారు.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జూలై 28(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం 27.4 మి.మీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. 21 మండలాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఈ నెలలో ఇప్పటివరకు 430.1 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 146.6 శాతం అధికంగా కురిసింది. గతేడాది జూలైలో 458.8 మి.మీటర్ల వర్షం కురవగా ఈనెలలో ఇప్పటివరకు 430.1 మి.మీటర్ల వర్షం కురిసింది. శుక్రవారం అత్యధికంగా కంగ్టి మండలంలో 44.7 మి.మీటర్లు, అత్యల్పంగా రామచంద్రాపురం మండలంలో 18.6 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. కల్హేర్ 40.9 మి.మీ, గుమ్మడిదల 38.6 మి.మీ, సిర్గాపూర్ 35.6 మి.మీ, నాగల్గిద్ద 30.2 మి.మీ, నారాయణఖేడ్ 30.1మి.మీ, మనూరు 29.8మి.మీ, మునిపల్లి 28.9మి.మీ, హత్నూర 28.7 మి.మీ, వట్పల్లి 27.4 మి.మీటర్ల వర్షం కురిసింది. మిగతా మండలాల్లో 25 నుంచి 10 మి.మీటర్ల లోపు వర్షపాతం నమోదైంది.
సింగూరుకు కొనసాగుతున్న వరద
సింగూరు ప్రాజెక్టులోకి వరద కొనసాగుతున్నది. శుక్రవారం సింగూరు ప్రాజెక్టులోకి 16030 క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం 23.629 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 29.917 టీఎంసీలు కాగా భారీ వర్షాలు కురిస్తే త్వరలోనే ప్రాజెక్టు నిండే అవకాశాలు ఉన్నాయి. సిర్గాపూర్లోని నల్లవాగు ప్రాజెక్టు, జహీరాబాద్లోని నారింజ ప్రాజెక్టు నిండుకుండలా మారాయి.
అలుగు పారుతున్న 187 చెరువులు
వర్షాలకు సంగారెడ్డి జిల్లాలోని చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. జిల్లాలో 187 చెరువులు అలుగుపారుతున్నాయి. సంగారెడ్డి ఇరిగేషన్ డివిజన్లో 137 చెరువులు, జహీరాబాద్ డివిజన్ పరిధిలో26, నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో 24 చెరువులు మత్తడి దుంకుతున్నాయి. జిల్లాలోని 215 చెరువులు వందశాతం నిండాయి. 739 చెరువుల్లోకి 75 శాతం నీరు వచ్చి చేరింది. 218 చెరువులు 50 శాతం నీటితో నిండాయి. దీంతో ఆయకట్టు పొలాలకు పుష్కలంగా సాగు నీరు అందనున్నది. సంగారెడ్డి జిల్లాలో కురిసిన వర్షాలకు పది కిలోమీటర్ల మేర రహదారులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ రహదారుల మరమ్మతులు చేపట్టేందుకు ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖలు చర్యలు తీసుకుంటున్నాయి. ఆర్అండ్బీ, పంచాతీరాజ్ పరిధిలో 20 వరకు కల్వర్టులు దెబ్బతిన్నాయి. వీటి పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. వర్షాలతో జిల్లాలో 310 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరో 20 ఇండ్లు పూర్తిగా కూలిపోయాయి. వర్షాలతో జిల్లాలో 900 ఎకరాల్లో సోయాబీన్, పత్తి, కంది, చెరుకు, పెసర, మినుము పంటలు నీట మునిగాయి. ఈ పంటల్లో 80 శాతం మేర రికవరీ అయ్యాయి.