సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా గ్రేటర్ వ్యాప్తంగా తేలిక పాటి నుంచి మోస్తరు వాన కురుస్తోంది. బుధవారం నగర వ్యాప్తంగా కొంత కొంత సేపటి విరామంతో తేలికపాటి వాన జల్లు కురిసింది. రాత్రి 9 గంటల వరకు నగరంలో 2 నుంచి 3 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
కాగా, వాయుగుండం ప్రభావంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా నగరంలో ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 26.0 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22.4 డిగ్రీలు, గాలిలో తేమ 90 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.