జహీరాబాద్, సెప్టెంబర్ 6: ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు సరఫరా చేసేందుకు పెండింగ్లో ఉన్న పను లు వెంటనే పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం జహీరాబాద్లోని ఆర్డీవో కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో పెండింగ్లో ఉన్న మిషన్ భగీరథ పనులు వెంటనే పూర్తి చేయాలని డీఈఈ సాబేర్ హుసేన్కు ఆదేశించారు. ఈ పథకం ఏర్పాటు చేసినప్పుటి నుంచి రెండు గ్రామాలకు నీరు సరఫరా కాకపోవడంపై కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పైపులైన్, నల్లాలు ఏర్పాటు చేసి ప్రజలకు స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయాలన్నారు. పైపులైన్ పనులు సక్రమంగా చేయని కాంట్రాక్టరుపై చర్యలు తీసుకోవాలన్నారు.
మిషన్ భగరీథ పనులకు పంచాయతీ నిధులు వినియోగించొద్దన్నారు. పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు పైపులైన్, నల్లాలు ఏర్పాటు చేసేందుకు నిధులు ఇవ్వడం లేదని, కలెక్టర్కు డీఈఈ తెలుపడంతో మీ వద్ద ఉన్న నిధులతో పనులు చేయాలని ఆదేశించారు. జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్ మండలంలో ఉన్న పైపులైన్, నల్లాల పెండింగ్ పనులు 15 రోజుల్లో పూర్తి చేసి నివేదిక పంపించాలన్నారు. జహీరాబాద్ మున్సిపల్లోని పస్తాపూర్లో మిషన్ భగీరథ పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు. హోతి(కే) శివారులో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద మిషన్ భగీరథ పనులు పూర్తి చేసేందుకు రూ.10 లక్షలు చెల్లిస్తామన్నారు. ఎక్కడ సమస్యలు లేకుండా పనులు పూర్తిచేయాలని మిషన్ భగరీథ ఎస్ఈ రఘవీర్కు ఆదేశించారు.
ఝరాసంగం మండలంలోని ఈదులపల్లి, మేదపల్లి, జీర్లపల్లి గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు పంపించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. న్యాల్కల్ మండలంలోని న్యామతాబాద్ గ్రామానికి మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలన్నారు. నిర్లక్ష్యం చేసే ఇంజినీరింగ్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు సమీక్ష నిర్వహిస్తున్నామని, నిర్లక్ష్యంగా పని చేసే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్లోని ఐడీఎస్ఎంటీ కాలనీలో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డికి ఆదేశించారు. జహీరాబాద్లోని కుల సంఘల సామూహిక భవనాల నిర్మాణానికి భూమి కేటాయించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు సమన్వంతో పనిచేయాలన్నారు. పెండింగ్లో ఉన్న పనులను 15 రోజుల్లో పూర్తి చేసి శాఖల వారీగా నివేదికలు ఇవ్వాలన్నారు.
జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలి (నిమ్జ్) భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ శరత్ ఆదేశించారు. నిమ్జ్ కార్యాలయంలో పలు రికార్డులు పరిశీలించి, ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ రాధాబాయికి పలు సూచనాలు చేశారు. గ్రామాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసి భూ సేకరణ చేయాలన్నారు. భూము లు ఇస్తున్న రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో అడిషన్ కలెక్టర్ చంద్రశేఖర్, జహీరాబాద్ ఆర్డీవో వెంకారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ తన్వీర్, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, మిషన్ భగీరథ ఎస్ఈ రఘవీర్, ఈఈ షేక్ పాషా, మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి, న్యాల్కల్ ఎంపీడీవో వెంకట్రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జి.గుండప్ప, నాయకులు పాల్గొన్నారు.