అందోల్/ వట్పల్లి, అక్టోబర్ 21: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఆరు అబద్ధాలేనని, ఆ పార్టీ నాయకులు ఎన్ని గ్యారెంటీలు ప్రకటించినా తెలంగాణలో వారికి వారంటీలేదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శనివారం అందోల్లో వట్పల్లి, రాయికోడ్ మండలాలకు చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నివర్గాలకు సీఎం కేసీఆర్ ప్రధాన్యతనిస్తున్నారన్నారు.
నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. అందోల్లో తన గెలుపు ఎప్పుడో డిసైడ్ అయ్యిందని, పార్టీ శ్రేణులు మెజార్టీ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాగా, వివిధ మండలాలకు చెందిన పలు సంఘాల నాయకులు ఎమ్మెల్యేను కలిసి మద్దతు ప్రకటించారు. ఇదిలా ఉండగా, పోతులబొగుడలోని ఎమ్మెల్యే నివాసంలో రాయికోడ్ మండలానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.