టేక్మాల్, ఫిబ్రవరి 4: ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రజలు, విద్యార్థులు కోరిక మేరకు మండల కేంద్రం నుంచి పటాన్చెరు వరకు కొత్తగా ఏర్పాటు చేసిన బస్సును ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుదర్శన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం, సురక్షితమని అన్నారు. ఆడపిల్లల కల్యాణానికి తల్లిదండ్రులు కష్టపడుతున్నారని, వారి కష్టాలు తీర్చడానికి కల్యాణలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చారన్నారు. లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కు, 22 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. అనంతరం టేక్మాల్ గ్రామ పంచాయతీలోని గొల్లగూడెంలో నిర్మించనున్న బీసీ కమ్యూనిటీ భవనానికి భూమి పూజ చేశారు.
అనంతరం గ్రామంలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఎలకుర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నాయికోటి సుప్రజా భాస్కర్, ఉప సర్పంచ్ పట్నం ప్రమీల, ఎంపీపీ చింత స్వప్న రవి, ఎంపీటీసీ నిమ్మ వాణి, తహసీల్దార్ హర్దీప్ సింగ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప, ప్రధాన కార్యదర్శి అవినాశ్, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయిలు, పీఏసీఎస్ చైర్మన్ యశ్వంత్ రెడ్డి, జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ విక్రమ్గౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, రవాణా శాఖ అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.