అందోల్, నవంబర్ 10: అందోల్ గడ్డ… గులాబీ అడ్డా అని… ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు అందోల్ ఆత్మగౌరవానికి వలస వాదుల అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అందోల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ అన్నా రు. ఈ పోరాటంలో ఆత్మగౌరవాన్ని గెలిపించి అహంకారవాదులను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి పెద్దఎత్తున్న తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలతో కలిసి ఎన్నికల నామినేషన్ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్సీ గొరటి వెంకన్న, స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ భిక్షపతితో కలిసి వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో అహంకార వాదులైన వలస పాలకులను ప్రజలు తరిమికొట్టాలన్నారు. 30న జరగనున్న ఎన్నికలు పార్టీల మధ్య కాదని, వలస పాలకుల అహంకారం-స్థానిక ప్రజల ఆత్మగౌరవం మధ్య పోటీ అని పేర్కొన్నారు. ఈరోజు తరలివచ్చిన జనసందోహాన్ని చూస్తుంటే అందోల్ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మెజార్టీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగ్రెస్ నాయకులు టికెట్లు అమ్ముకోవడం, వచ్చిన సొమ్మును దాచుకోవడంపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. రాత్రికి ఒక నాయకుడి పేరు ప్రకటిస్తారు..
ఉదయం ఇంకో వ్యక్తికి బీఫాం ఇస్తారని ఎద్దేవ చేశారు. అనునిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తున్నారని, మరోసారి గెలిపిస్తే అందోల్ను మరింత అభివృద్ధి చేస్తానన్నారు. కొన్ని సంవత్సరాలు అందోల్ నుంచి ఎమ్మెల్యేగా, మంత్రులుగా పనిచేసి ఇక్కడి ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేదని, ఇప్పుడు కొత్తగా ఏం చేయరన్నారు. ఇదే మాకు చివరి ఎన్నికలని… ఒకసారి గెలిపించాలని కొత్తపాట పాడుతున్నారని వారి మాటలు వింటే అందోల్ మళ్లీ యాబై ఏండ్లు వెనక్కి వెళ్తుందన్నారు. మన నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ వస్తున్నాడని లక్షమందితో భారీగా సభను నిర్వహించుకుందామన్నారు. ఎంపీ బీబీపాటీల్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, కార్పొరేషన్ చైర్మన్ భిక్షపతి మాట్లాడుతూ స్థానిక నాయకుడు క్రాంతికిరణ్ను గెలిపించి, స్థానికేతరులను తరిమికొట్టాలన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావడంతో అందోల్-జోగిపేట పట్టణాలు మొత్తం గులాబీమయమాయ్యయి. చేఅక్కడ పార్టీ శ్రేణులు వారిని గజమాలతో సత్కరించగా ర్యాలీగా జోగిపేట అంబేద్కర్ విగ్రహం వరకు వచ్చారు. కార్యక్రమంలో స్టేట్ మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, జైపాల్రెడ్డి, రాహుల్కిరణ్, లింగాగౌడ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.