ఉమ్మడి మెదక్ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలవడం ఖాయమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. మంగళవారం అందోల్లో ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ బూత్స్థాయి సమావేశం నిర్వహించారు. జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ భిక్షపతితో కలిసి హాజరై మాట్లాడారు. అందోలు నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ను కార్యకర్తలు, ఓటర్లు భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. క్రాంతికిరణ్ స్థానికుడని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సేవచేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ను నమ్ముకుంటే రాష్ర్టాన్ని అమ్ముకుంటారని, అందుకు ప్రత్యక్ష సాక్ష్యం మన పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రం ఉదాహరణ అన్నారు. కాంగ్రెసోళ్లు కుర్చీల కోసం కొట్లాడుతుంటే, అభివృద్ధి కోసం తండ్లాడుతున్నామన్నారు.
అందోల్, నవంబర్ 7: ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ను గెలిపించటమే లక్ష్యమని, ఎన్నికల్లో పది స్థానాల్లో గెలుస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం, జిల్లా అభివృద్ధి చెందిందని తెలిపారు. అందోలు నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ను కార్యకర్తలు, ఓటర్లు భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంత్రికిరణ్ స్థానికుడని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సేవచేస్తున్నారని తెలిపారు. అలాంటి నాయకుడిని మరోమారు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలు, నియోజకవర్గం బాగుపడుతుందన్నారు. ఇతర పార్టీ నేతలను గెలిపిస్తే వారు హైదరాబాద్కే పరిమితం అవుతారని తెలిపారు. అందోలు నియోజకవర్గంలో కాంత్రికిరణ్ను గెలిపిస్తామని బీఆర్ఎస్ బూతుస్థాయి ఇన్చార్జిలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి హరీశ్రావు ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేయించారు. కాంగ్రెస్ను నమ్ముకుంటే రాష్ర్టాన్ని అమ్ముకుంటారని, అందుకు ప్రత్యక్ష సాక్ష్యం మన పక్కనే ఉన్నా కర్ణాటక రాష్ట్రం అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
సోమవారం అందోల్లో ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ బూత్స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ భిక్షపతితో కలిసి హాజరైన మంత్రి కాంగ్రెస్ అవినీతిని ఎండగట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదని రైతులకు కనీసం మూడు గంటల కరెంట్ సైతం అందించడం లేదన్నారు. అక్కడి ప్రభుత్వ పాలన చూసి విసుగు చెందిన రైతులు ఇక్కడికి వచ్చి వారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి స్వయంగా చెప్పినా, కాంగ్రెస్ నాయకులు అబద్ధాలు ప్రచారం చేయడం ఆపడం లేదన్నారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలబెట్టడానికి కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు ప్రజలను ఆగం చేయాలని చూస్తున్నాయన్నారు. రైతుబంధు సృష్టికర్త కేసీఆర్ అని రైతుబంధు ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఈ పథకం అమలు జరగుతుందా అని గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను రైతులు ప్రశ్నించాలన్నారు. వచ్చేసారి రైతుబంధు రూ.16వేలు ఇస్తామని, పెన్షన్లు పెంచుతామని, గృహలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి ఇలా ఎన్నో గొప్పగొప్ప పథకాలు అమలు చేయనున్నామని ఇవ్వన్నీ ప్రజలకు వివరించే బాధ్యత బూత్లెవల్ నాయకులపై ఉన్నదన్నారు.
ప్రజలకు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని వివరించి ప్రజలను ఓట్లు అడగాలన్నారు. అన్ని సర్వేలు మనం భారీ మెజార్టీతో గెలవనున్నామని చెబుతున్నాయని, ఇంతటితో సంబరపడిపోవద్దని జిల్లాలో పదికి పది స్థానాల్లో ఘన విజయం సాధించి కేసీఆర్కు కానుకగా ఇవ్వాలన్నారు. రూ.4వందలకే గ్యాస్ సిలిండర్, సౌభాగ్యలక్ష్మి ద్వారా మహిళల రూ.3వేలు, రేషన్కార్డున్న ప్రతిఒక్కరికీ 6 కిలోల సన్నబియ్యం ఇవ్వనున్నామని, రైతుబీమాలాగే ఒక్క రూపాయి ఖర్చులేకుండా రూ. 5 లక్షల బీమా ఇవ్వనున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లోకి వచ్చి కొత్తగా ఒక్క అవకాశం ఇవ్వండి..? అభివృద్ధి చేస్తామంటున్నారు ఒక్కసారి కాదు 11సార్లు మీకే గెలిపించారు కదా..? ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఆ పార్టీది కుర్చీల కొట్లాట అని కానీ…బీఆర్ఎస్ది మాత్రం ప్రజల కోసం…వారి అభివృద్ధి కోసం తండ్లాటా అన్నారు. సద్దికట్టిన రేవును మరవొద్దు- అబద్ధాలు చెప్పే కాంగ్రెస్ను నమ్మి ఆగం కావొద్దని అభివృద్ధి చేసిన బీఆర్ఎస్కే మళ్లీ పట్ట కట్టాలన్నారు. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి తాను అడిగిన వాళ్లకు టికెట్ ఇవ్వలేదని అలిగి ఉన్నాడాని… మరోపక్క పటాన్చెరువు టికెట్ రూ.100కోట్లకు అమ్ముకున్నారని అక్కడి నాయకులు నిరసనలు చేపడుతున్నారని..ఇలాంటి అమ్ముడుపోయే నాయకులు మనకొద్దు. లోకల్ బిడ్డ, మంచి మనిషి, అభివృద్ధిపై తపన ఉన్నోడు క్రాంతికిరణ్ను నిండు మనస్సుతో దీవించి కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ భిక్షపతి మాట్లాడుతూ లోకల్ వ్యక్తి, ప్రజలకు అందుబాటులో ఉండే స్థానిక అభ్యర్థి క్రాంతికిరణ్ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అందోల్ అభ్యర్థి క్రాంతికిరణ్ మాట్లాడుతూ అందోల్ ప్రజలు ఐదేండ్లుగా గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారన్నారు. వారు తనపై పట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని మరోసారి గెలిపిస్తే ప్రతిఒక్కరికీ అండగా ఉండి సేవ చేసుకుంటానన్నారు. కార్యక్రమంలో ఎన్నికల ఇన్చార్జి ఫరూఖ్హుస్సేన్, స్ట్టేట్ మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర నాయకులు రాహుల్కిరణ్, జైపాల్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పల్లె సంజీవయ్య, ఎంపీపీ బాలయ్య, పార్టీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్రెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.