చేర్యాల, మే 19: మండలంలోని వేచరేణి శివారు ఎల్లదాస్నగర్లో తాగు నీటిని అందించే 10వేల లీటర్ల నీటి ట్యాంకు నుంచి నిత్యం మిషన్ భగీరథ జలాలు వృథాగా పోతున్నా పట్టించుకోవడం లేదు.కొన్ని గ్రామాల్లో ప్రజలు తాగు నీటికి తండ్లాడుతుంటే, మరిన్ని గ్రామాల్లో ఇలా తాగునీరు వృథాగా పోతున్నది. ఎల్లదాస్నగర్కు నీటిని అందించేందుకు 10వేల లీటర్లు, 20వేల లీటర్ల నీటి ట్యాంకులు ఉన్నాయి.
ఇందులో ప్రభుత్వ పాఠశాల భవనాల పక్కనే ఎర్రకుంట సమీపంలో ఉన్న 10వేల లీటర్ల నీటి ట్యాంకు నిండిపోయి గంటల పాటు గోదావరి జలాలలు వృథాగా ప్రవహిస్తూ, పక్కనే ఉన్న కుంటలోకి పోతుండడం గమనార్హం. ఇదే ట్యాంకు నుంచి నీళ్లు వృథా అవుతున్నాయని సమీపంలో ఉన్న హనుమాన్ ఆలయానికి ఓ పైపులైన్ ఏర్పాటు చేశారు. గంటల పాటు నీరు నేరుగా కుంటలోకి వెళ్లిపోయినా పట్టించుకోవడం లేదు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.