మిరుదొడ్డి, జనవరి 9: ఉమ్మడి మిరుదొడ్డి మండల పరిధిలోని 24 గ్రామాల్లో కలిపి మొత్తం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు లెక్కల ప్రకారం 50,952 కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో 20 గ్రామ పంచాయతీల్లోని ప్రజలకు ప్రతి ఇంటికి తాగునీటిని ఉదయం, సాయంత్రం సమయాల్లో రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్నది.
గతంలో తాగునీటికి బోరు బావులే దిక్కు
గతంలో పల్లెల్లో నీటి గోస ఉండేది. గ్రామ పంచాయతీ నల్లాల వద్దనే రెండు మూడు బిందెల నీళ్లు మాత్రమే దొరికేవి. ఆ నీళ్ల కోసం నిత్యం గొడవలు జరిగేవి. బోరుబావుల వద్దకు వెళ్లి తాగునీటిని సైకిళ్లపై, నెత్తిపై తెచ్చుకునేవారు. ఇలా ప్రతిరోజూ ఉదయ లేవగానే మహిళలు, మగవారు అనే తేడాలు లేకుండా నీటిని తెచ్చుకునేవారు. నీటి కోసం ధర్నాలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. కానీ ఇప్పుడు పల్లెల్లో అలాంటి
పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
వాకిట్లోకి గోదావరి జలాలు
స్వరాష్ట్రంలో మహిళలకు తాగునీటి గోస పూర్తిగా తీరిపోయింది. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఓహెచ్ఆర్ ట్యాంకుల నిర్మాణంతోపాటు, గ్రామాల్లోని ప్రతి ఇంటికి తాగునీరు అందించడానికి మండలంలో 113 కిలోమీటర్ల మేరకు పైపులైన్ నిర్మించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.11 కోట్ల 28 లక్షల 8 వేల నిధులు వెచ్చించింది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఒక్కొక్కరికి 50 లీటర్ల చొప్పున 24 గ్రామాల ప్రజలకు మొత్తం కలిపి 25 లక్షల 18 వేల లీటర్ల నీటిని గోదావరి నది నుంచి తాగునీటిని నిత్యం సరఫరా చేస్తున్నారు.
తాగునీటి గోస తీర్చిన కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్న ప్రజలు
కొన్నేండ్ల నాటి నుంచి తాగునీటి కష్టాలను మిషన్ భగీరథ పథకం ద్వారా తీర్చడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలకు మిరుదొడ్డి, అక్బర్పేట-భూంపల్లి మండలాలకు చెందిన ప్రజలు కృతజ్ఞతలు తెలపుతున్నారు.
ప్రజల కోసమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు
గ్రామీణ ప్రాంత ప్రజలను ఆర్థికంగా ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ పేదల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో శుద్ధమైన తాగునీటిని ప్రజలకు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ది.
– కొత్త ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు