సిద్దిపేట జిల్లాలో 6వేల యూరియా బస్తాలు మాయమైనట్లు యాప్ ద్వారా గుర్తించి, ఇద్దరు హోల్సేల్ డీలర్లు, ఒక రిటైలర్ లైసెన్స్ను వ్యవసాయశాఖ రద్దు చేసి అరెస్ట్ చేయడంతో పాటు విధుల్ల్లో నిర్లక్ష్యం వహించిన వ్యవసాయాధికారిపై చర్యలు తీసుకోవడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. యూరియా అక్రమాలను ప్రభుత్వం ఏమాత్రం సహించదని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
రైతుల ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వం రాజీపడదని, ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం యూరియా యాప్ను సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. యూరియా పంపిణీని పూర్తిగా ఫర్టిలైజర్ యాప్ ద్వారా నిర్వహించడం వల్ల అక్రమదారులకు అన్ని మార్గాలు మూసుకుపోయాయన్నారు. రైతులకు సక్రమంగా అందాల్సిన యూరియాను ఎవరైనా అక్రమంగా పకదారి పట్టించేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైతులకు అందాల్సిన సబ్సిడీ ఎరువులను దుర్వినియోగం చేయడానికి లేదా అక్రమాలకు పాల్పడేందుకు ఎవరికీ అవకాశం ఇవ్వమని మంత్రి స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎరువుల సరఫరా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, క్రమశిక్షణ అమలు చేస్తున్నామన్నారు. రైతుల హకులు కాపాడటంలో ప్రభుత్వం ఎలాంటి రాజీపడదని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో యూరియా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల పునరుద్ఘాటించారు.
చేర్యాల, జూలై 1 : సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో వెలుగు చూసిన యూరియా సబ్సిడీ అవకతవకల కేసులో నిందితుడిని చేర్యాల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చేర్యాల డివిజన్ అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ టి.రాధిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు చేర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా వ్యవసాయాధికారి ఆదేశాల మేరకు చేర్యాల మండల వ్యవసాయాధికారి బోగేశ్వరస్వామి గత నెల 9న ఎంఎస్ శ్రీసాయి శివ ఫర్టిలైజర్ దుకాణాన్ని తనిఖీ చేశాడు.
తనిఖీలో గోదాంలో యూరియా నిల్వలు భౌతికంగా కనిపించకపోవ డంతో పాటు స్టాక్ రిజిస్ట్టర్లో వివరాలు నమోదు చేయలేదని గుర్తించాడు. దర్యాప్తులో డీలర్ చేతిరెడ్డి సందీప్రెడ్డి 6,429 యూరియా బస్తాలకు సంబంధించిన ట్యాక్స్ ఇన్వాయిస్లను ఈ-పాస్ నుంచి ఫర్టిలైజర్ యూరియా యాప్లో అంగీకార ధృవీకరణ చేయలేదని గుర్తించారు. రైతులకు యాప్లో యూరియా బుకింగ్ కనిపించకుండా ఉన్నప్పటికీ విక్రయించినట్లు తప్పుడు బిల్లులు సృష్టించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ-పాస్లో మాత్రమే లావాదేవీలు నమోదు చేసి భౌతిక బిల్లులు, స్టాక్ రిజిస్టర్, ఇన్వాయిస్లు కేవలం కాగితాల పై మాత్రమే తయారు చేసినట్లు విచారణలో తేలింది. ప్రభుత్వం రైతులకు ఒక్కో యూరియా బస్తాపై రూ.2,200 నుంచి రూ.2,500 వరకు సబ్సిడీ అందిస్తుండగా రైతులకు నిర్ణయించిన గరిష్ట ధర రూ.266 మాత్రమే. అవకతవకల కారణంగా అసలైన రైతులకు యూరియా అందకుండా చేసి సుమారు రూ.17,10,144 విలువైన సబ్సిడీ యూరియాను దారి మళ్లించిన సదరు నేరాస్తులపై చర్యలు తీసుకొని 6429 యూరియా బస్తాలు మాయం చేసిన ఎంఎస్ శ్రీ ఆంజనేయ ఫర్టిలైజర్స్, సీడ్స్, ఎంఎస్ శ్రీ గణేశ్ ట్రేడర్స్, ఎంఎస్ శ్రీ సాయి శివ ఫర్టిలైజర్పై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ ఏడీ రాధిక ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడైన చేతిరెడ్డి సందీప్రెడ్డిని బుధవారం చేర్యాల సీఐ రమేశ్నాయక్ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.