పరకాల, ఆగస్టు 10: అధికార పార్టీ నాయకుల అండ, రెవెన్యూ అధికారుల చేతివాటంతో రూ. 50 కోట్ల విలువ చేసే 25 ఎకరాల భూమికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా రికార్డులు మారాయి. చనిపోయిన వ్యక్తికి ఈ కేవైసీ చేయడం, పట్టాదారు వేలిముద్ర లేకుండానే సదరు భూమిలో కొంత ఇతరుల పేర రిజిస్ట్రేషన్ చేశారు. ఇదేమిటని అడిగిన వారిపై దాడికి దిగడం వంటి ఘటనలు హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. తమ భూములను నకిలీ ధ్రువీకరణపత్రాలతో కొందరు అక్రమంగా పట్టా చేసుకున్నారని, వాటిని రద్దుచేసి తమకు న్యాయం చేయాలని బాధితులు కలెక్టర్ను కోరారు. సోమవారం బాధితులు పోరండ్ల రాజయ్య, సురేశ్, రామిశెట్టి రాజేందర్ పరకాల ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ..
సుమారు రూ.50 కోట్ల విలువ చేసే 25 ఎకరాల భూమిని పరకాల తహసీల్దార్ ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా పట్టా చేశారని ఆవేదన చెందారు. పరకాల శివారులోని సర్వే నంబర్లు 682, 683, 698, 195, 637, 639, 640, 648, 750, 751, 752, 746, 749, 779లోని సొంత భూములకు నకిలీ పత్రాలను సృష్టించి కొలగాని భాగ్యమ్మ వద్ద నుంచి ఆముదాల రవి, పల్లెని వసంత, బొద్దిరెడ్డి ప్రియదర్శిని, తకళ్లపల్లి రంజిత్రావు, ఎర్రబెల్లి గోపి, వేముల రాధమ్మ, చదువు రమణారెడ్డి, రాహుల్.. స్థానిక తహసీల్దార్తో కుమ్మక్కై పట్టా చేసుకున్నారని ఆరోపించారు.
పరకాలకు చెందిన కొలగాని నాగయ్యకు నలుగురు కూతుర్లు కాగా, తనకున్న 50 ఎకరాల వ్యవసాయ భూమిని ఒకొకరికి సమానంగా పంచుతూ 1972లో వీలునామా రాశారని, కానీ కొలగాని నాగరాజు కొంతమంది దళారులతో కలిసి మొత్తం ఆస్తికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి కాజేశాడని తెలిపారు. ఈ భూముల వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నదని చెప్పారు. ఈ భూములను అప్పటి ఆర్డీవో సహకారంతో తహసీల్దార్ అక్రమంగా పట్టా చేశారని, ఈ వ్యవహారంలో లక్షల రూపాయల డబ్బు చేతులు మారిందని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు నింబంధనలకు విరుద్ధంగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని, ఈ వ్యవహారంలో చనిపోయిన వ్యక్తికి ఈ కేవైసీ చేసి రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారని ప్రశ్నించారు.
పట్టాదారు పాస్బుక్కులు ఉన్న వ్యక్తి వేలిముద్రలు వేయకుండానే రెవెన్యూ అధికారులు తన భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారని విమర్శించారు. ఇందేంటని తహసీల్దార్ను ప్రశ్నిస్తే ‘మీ భూమిని మీకు చేస్తా. అలా వీలుకాని పక్షంలో వేరే సర్వే నంబర్పై మీ పేర భూమిని ఇస్తా’మని మభ్యపెడుతున్నట్టు తెలిపారు. ఈ విషయమై కలెక్టర్ చొరవ చూపి విచారణ చేపట్టి, అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవడంతోపాటు తమకు న్యాయం చేయాలని కోరారు.