కాళేశ్వరం ప్రాజెక్టుతో మెదక్ జిల్లాలో సాగు విస్తీర్ణం నాలుగు రెట్లు పెరిగిందని, ఈ వానకాలంలో 3 లక్షల 76వేల 220 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసేందుకు కార్యాచరణ రూపొందించామని రాష్ట్ర పశువైద్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండావిష్కరణ చేశారు. అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ యాసంగిలో 2 లక్షల 39వేల 579 మంది రైతులకు రూ.189 కోట్ల రైతుబంధు సాయం అందించామన్నారు. రూ.445కోట్లతో 1870 చెరువుల అభివృద్ధి, కాలువల మరమ్మతులు, నిర్మాణాలు చేశామన్నారు. మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు 1,614 చెరువుల్లో 19 కోట్ల చేప పిల్లలను వంద శాతం రాయితీతో వదిలామని తెలిపారు. కార్పొరేట్కు దీటుగా రూ.131 కోట్లతో 313 ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు వివరించారు. మహిళలు, పిల్లల భద్రత కోసం జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రం ఏర్పాటు చేశామని, భవన నిర్మాణం కోసం రూ.2.5కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.
మెదక్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏండ్లు గడిచినా జరగని అభివృద్ధి ఈ 9 ఏండ్లల్లో జరిగిందని, దేశంలో ఎక్కడా అమలు చేయని విధంగా ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, డబుల్ బెడ్రూం ఇండ్లు, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, దళితబంధు, కంటి వెలుగు వంటి ఎన్నో వినూత్న పథకాలను అమలు చేస్తూ అనతి కాలంలోనే వివిధ రంగాల్లో అభివృద్ధిని సాధించి, దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నదని పశువైద్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్య్స, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మెదక్ కలెక్టరేట్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తలసాని జెండావిష్కరణ చేశారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాథమిక రంగమైన వ్యవసాయ అభివృద్ధియే ఇతర రంగాల అభివృద్ధికి ఆధారభూతంగా నిలుస్తుందని, సుసంపన్నమైన వ్యవసాయానికి ప్రతీక అయిన తెలంగాణ నేడు దేశానికి దిశా నిర్దేశం చేస్తుందన్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ విధానాలు తమ రాష్ర్టాల్లోనూ అమలు చేయాలని రైతులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడకముందు మెదక్ జిలాల్లో 2013-14లో లక్షా 61వేల 891 ఎకరాలల్లో వరి, పత్తి, కం దులు, మొక్కజొన్న, పెసర వంటి పంటలు సాగు చేశారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవసాయాభివృద్ధి చర్యల వల్ల సాగు విస్తరణ 2022-23లో 6 లక్షల 22వేల 70 ఎకరాల్లో సాగు చేస్తున్నారని తెలిపారు. సకాలంలో రైతు బంధు, 24 గం టల ఉచిత విద్యుత్ రైతులకు అందడం, కాళేశ్వరం ప్రాజెక్టుల వల్ల జిల్లాలో సాగు విస్తీర్ణం నాలుగు రేట్లు పెరిగిందని, ఈ వానకాలంలో 2023లో 3 లక్షల 76వేల 220 ఎకరాల్లో వరి, పత్తి, కందులు, మొక్కజొన్న, పెసర వంటి పంటలు సాగు చేసేందుకు కార్యాచరణ రూపొందించారని తెలిపారు.
శాంతి భద్రతల నిర్వహణ సమర్ధవంతంగా జరిగితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతున్నదని మంత్రి తలసాని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఈరోజు రాష్ర్టానికి పెట్టుబడులు వస్తున్నాయంటే రాష్ట్రంలో మెరుగైన శాంతిభద్రల నిర్వహణ ఒక కారణమన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నూతనంగా 5 పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేసుకొని కొనసాగిస్తున్నామని, మహిళలు, పిల్లల భద్రతకు జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రం ఏర్పాటు చేశాని తెలిపారు. కొత్తగా భరోసా భవన నిర్మాణానికి రూ.2.50 కోట్లు మంజూరయ్యాయి. ప్రభుత్వ సహకారంతో సైబర్ నేరాల నియంత్రణలో జిల్లా పోలీసు కార్యాలయంలో ఆధునిక పరికరాలు ఏర్పాటు చేసుకొని ప్రజలకు సేవలు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణిప్రియదర్శిని, అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ జగపతి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆవిర్భావ వేడుకల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్యాలు, ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల విద్యార్ధులు చేసిన నృత్యాలు అలరింపజేశాయి. హవేళీఘనపూర్ మం డలం కుచన్పల్లి జడ్పీ పాఠశాల, మెదక్ మండలం మక్తభూపతిపూర్ జడ్పీ పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు విద్యార్థులకు మెమోంటోలు అందజేశారు.
మత్య్సకారుల అభివృద్ధికి మెదక్ జిల్లాలో చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నదని మంత్రి తలసాని తెలిపారు. మెదక్ జిల్లాలోని 1,614 చెరువుల్లో 19 కోట్ల చేప పిల్లలను వంద శాతం రాయితీతో వదిలారని, తద్వారా 279 మత్య్స సహకార సంఘాల్లోని 16వేల 200 మంది సభ్యుల కుటుంబాలకు జీవనోపాధి లభిస్తున్నదన్నారు. మత్య్స అభివృద్ధి పథకం కింద 75 శాతం సబ్సిడీతో మత్య్సకారులకు ఐస్ బాక్సులు, డిజిటల్ కాంటాలు, టీవీఎస్ మోపెడ్లు, సరుకు రవాణా వాహనాలు, వలలు అందించారని తెలిపారు.
ఆడపిల్ల పెండ్లి ఖర్చుల కోసం ప్రభుత్వం రూ.లక్షా 116 ఆర్థిక సాయం అందిస్తున్నదని, మెదక్ జిల్లాలో కల్యాణలక్ష్మి కింద 26,150 మందికి రూ.242.10 కోట్లు, షాదీముబారక్ కింద 2169 మంది లబ్ధిదారులకు రూ.19.21 కోట్లు అందించారని మంత్రి తెలిపారు. 18 ఏండ్లు నిండిన ఆడ పిల్లలకు ఈ పథకం వర్తిస్తుండడంతో బాల్యవివాహాలు తగ్గిపోయాయన్నారు.
కార్పొరేట్కు దీటుగా విద్య అందించాలనే లక్ష్యంతో మనఊరు-మనబడి కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి గుర్తుకు చేశారు. ఈ కార్యక్రమం కింద మెదక్ జిల్లాలో 313 పాఠశాలలను ఎంపిక చేసి, రూ.131 కోట్లతో అన్ని హంగులతో పాఠశాలలను సిద్ధం చేశారన్నారు. జిల్లాలోని 705 ప్రాథమిక పాఠశాలలో 727 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు ట్యాబ్లను పంపిణీ చేసి డిజిటల్ విద్యను అందిస్తున్నాం. 152 ప్రాథమిక పాఠశాలలో గ్రంథాలయాలను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.
2018లో కంటి వెలుగు కార్యక్రమాన్ని వ్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం 4,39,316 మందికి పరీక్షలు నిర్వహించి, లక్షలకుపైగా అద్దాలను పంపిణీ చేసి రికార్డు సృష్టించిందని మంత్రి తలసాని తెలిపారు. 2వ విడత కంటి వెలుగులో ఇప్పటి వరకు మెదక్ 4,41,494 మందికి పరీక్షలు నిర్వహించగా, 45,793 రీడింగ్ అద్దాలను అందజేశారన్నారు. 38,766 ప్రిస్కిప్షన్ అద్దాలు అందజేసినట్లు వివరించారు. బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు ప్రారంభించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని, మెదక్ ప్రాంతాల్లో 2 బస్తీ దవాఖానలు, 98 పల్లె దవాఖానలు పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాయన్నారు. మెదక్ జిల్లాలో డయాలసిస్ సేవలు మార్చి 2018లో ప్రారంభించారని, ఇప్పటి వరకు జిల్లాలో 27,241 మందికి డయాలసిస్ సేవలు అందిస్తున్నారన్నారు. కేసీఆర్ కిట్ 16 ప్రత్యేక వస్తువులతో కూడిన కిట్ ప్రభుత్వం అందిస్తున్నదని, ఈ పథకం కింద ఇప్పటి వరకు జిల్లాలో 31,311 మంది మహిళలు లబ్ధి పొందారని మంత్రి వివరించారు.
సీఎం కేసీఆర్ ఆలోచనల వెలుగులో ఆవిష్కృతమైన రైతుబంధు పథకం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందిందన్నారు. ఈ పథకం కింద ప్రతి రైతుకు ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారని పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో ఈ యాసంగిలో 2 లక్షల 39వేల 579 మంది రైతులకు రూ.189 కోట్ల 57 లక్షలు అందించినట్లు తెలిపారు.
రైతుబీమా కింద జిల్లాలో 2022-23లో 1,44,693 మంది రైతుకకు రైతుబీమా నమోదు చేయగా, అందులో 2022-23కి ఇప్పటి వరకు 544 మంది రైతులు మరణించగా, ఒక్కో రైతు ఖాతాలో రూ.5 లక్షల చొప్పున రూ.27.20 కోట్లు జమ చేసినట్లు మంత్రి చెప్పారు. రైతు మరణించిన నాటి నుంచి 10 రోజుల్లో బీమా సొమ్ము వస్తున్నదన్నారు.
మెదక్ జిల్లాలో 411 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తలసాని తెలిపారు. 2016-17 వానకాలంలో 72వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయగా, 2022-23 వానకాలంలో 3.93వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ యాసంగిలో జిల్లాలో 3 లక్షల 51వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేయగా, ఇప్పటి వరకు 2.26 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారని తెలిపారు.
మిషన్ కాకతీయ ద్వారా మెదక్ జిల్లాలో 1870 చెరువుల పునరుద్ధరణ పనులకు రూ.445 కోట్ల పనులు చేపట్టిట్లు మంత్రి వివరించారు. ప్రాజెక్టులతో అనుసంధానం చేయడంతో వేసవిలో సైతం చెరులు జలకళను సంతరించుకుంటున్నాయని, భూగర్భ జలమట్టం పెరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ సరోవర్ పథకానికి మన మిషన్ కాకతీయనే ప్రేరణగా నిలిచిందని, వివిధ రాష్ర్టాలు మిషన్ కాకతీయ తరహా చెరువుల పునరుద్ధరణకు పూనుకోవడం గర్వకారణమన్నారు.
గత ప్రభుత్వాలు కంటి తుడుపుగా రూ.200 పింఛన్ ఇచ్చేవని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆసరా పింఛన్ కింద ఇచ్చే మొత్తాన్ని ప్రభుత్వం రూ.2,016 పెంచిందని మంత్రి తలసాని తెలిపారు. దివ్యాంగులకు రూ.3,016 పెంచింది. ప్రజల కష్టాలు ఎరిగిన ప్రభుత్వం మేనిఫెస్టోలో లేక పోయినా, ఎవరూ డిమాండ్ చేయకపోయినా పింఛన్ పెంచి ఇస్తుందన్నారు. మెదక్ జిల్లాలో ప్రస్తుతం 1,16,882 మందికి ప్రతినెలా రూ.26.07 కోట్లు అందిస్తున్నారు. 2014 నుంచి నేటి వరకు రూ.1,555.90 కోట్లు పింఛన్ల ద్వారా అందజేస్తున్నారని మంత్రి తెలిపారు.
చరిత్రలో మున్నుపెన్నడూ లేనివిధంగా ప్రభుత్వం దళిత బంధుతో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు సాయం అందజేసి ఆర్థికంగా బలోపేతం చేస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. ఈ పథకం కింద జిల్లాలో 256 మంది లబ్ధిదారులకు రూ.25.34 కోట్ల అందించారని తెలిపారు. అలాగే దళిత విద్యార్థుల విదేశీ విద్య కోసం అంబేద్కర్ ఓవర్సిస్ పథకం కింద 20 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నదని, తెలంగాణ ఏర్పడే నాటికి ఎస్సీల కోసం కేవలం 2 రెసిడెన్షియల్ విద్యాలయాలు ఉంటే, తెలంగాణ వచ్చిన తర్వాత 5కు పెరిగాయని వివరించారు. వీటిలో విద్యార్థుల సంఖ్య 1280 నుంచి 3400కు పెరిగిందని, దళితులకు గృహ అవసరాలకు 101 యూనిట్ల వరకు విద్యుత్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని, ఇప్పటి వరకు మెదక్ జిల్లా నుంచి రూ.17.83 కోట్లు మంజూరు చేశారని చెప్పారు.