హుస్నాబాద్, ఫిబ్రవరి 1: అధికారుల నిర్లక్ష్యంతో లక్షలాది రూపాయలతో నిర్మించిన భవనం నిరుపయోగంగా మారింది. దీంతో డిగ్రీ చదివే విద్యార్థులు రేకుల షెడ్లలోనే పాఠాలు వినాల్సి వస్తోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను రూ.2.25 కోట్లతో బీఆర్ఎస్ సర్కారు సకల వసతులతో నిర్మించింది. కరీంనగర్ రోడ్డులోని మోడల్ స్కూల్ పక్కన పూర్తయిన భవనాన్ని మేలో అప్పటి ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కళాశాలను అందులోకి మార్చాలని స్థానిక విద్యార్థి సంఘాలు, విద్యార్థులు కోరుతున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. హుస్నాబాద్కు డిగ్రీ కళాశాల మంజూరైనప్పటి నుంచి గతంలో జూనియర్ కళాశాల నడిచిన రేకుల షెడ్లలోనే డిగ్రీ తరగతులు నడుస్తున్నాయి. వర్షం పడితే గదుల్లోకి నీళ్లు రావడం, ఎండకాలం ఉక్కపోతతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాశాలలో ప్రస్తుతం 375మంది విద్యార్థులు ఉన్నారు.
వీరందరూ అసౌకర్యాల మధ్య చదువు కొనసాగిస్తున్నారు. కొత్తగా నిర్మించిన భవనంలో విద్యుత్తు, నీటి సౌకర్యం లేకపోవడంతో అందులోకి వెళ్లడం లేదని కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు చెబుతున్నారు. అధికారులు స్పందించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కొత్తగా నిర్మించిన భవనంలోకి మార్చాలని, లేకుంటే వచ్చే విద్యాసంవత్సరం అడ్మిషన్లు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదముం దని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పం దించి సంబంధిత అధికారులతో మాట్లాడి కొత్త భవనంలో సరిపడా సౌకర్యాలను కల్పించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అక్కడే తరగతులు నడిచేలా చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.