అక్కన్నపేట, మార్చి 14: మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్ట్పై ప్రత్యేక దృష్టి సారించామని, గత ప్రభుత్వంలోని ఆగిన పనులు పూర్తిచేసి మెట్ట ప్రాంతానికి సాగునీరందిస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం అక్కన్నపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన సుమారు రూ. 1.01 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తుందన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం ఎంతగానో ఆదరణ పొంది విజయవంతంగా అమలు అవుతున్నదన్నా రు. కుటుంబానికి రూ. 500 గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇండ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే విధంగా ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు. కొత్తగా ఏర్పడిన అక్కన్నపేట మండలాన్ని పార్టీలకు అతీతంగా అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో కృషిచేస్తానన్నారు.
మండల కేంద్రంలో సమీకృత భవన సముదాయ నిర్మాణాల కోసం ప్రతిపాదనలు సిద్ధ్దం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో హుస్నాబాద్ ఆర్డీవో రామ్మూర్తి, ఎంపీపీ మాలోతు లక్ష్మీబీలూనాయక్, జడ్పీటీసీ భూక్యమంగా, మాజీ సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డి, ఎంపీటీసీ పెసరు సాంబరాజు, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జంగపల్లి అయిలయ్య, ఎంపీటీసీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
హుస్నాబాద్, మార్చి 14: హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లోని పలు హాబిటేషన్లకు మిషన్ భగీరథ కింద తాగునీటి పరఫరా పనుల నిర్వహణ కోసం రూ.3.40కోట్ల నిధులు మంజూరైనట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ప్రకటనలో తెలిపారు.
హుస్నాబాద్ మండలం పోతారం పరిధిలోని హనుమాన్నగర్, కూచనపల్లి గ్రామ పరిధిలోని పునరావాస కాలనీకి తాగునీటి కోసం రూ.58లక్షలు, అక్కన్నపేట మండలంలోని కేశనాయక్తండా, బంజారాహిల్స్తండా, న్యూతండాలకు తాగునీటి సరఫరా కోసం రూ.1.23కోట్లు మంజూరయ్యాయి. కేశనాయక్తండా, ఆర్అండ్ఆర్ కాలనీ, సేవాలాల్తండాలకు అదనంగా రక్షిత నీరు అందించడం కోసం మరో రూ.1.58కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులతో పనులు వెంటనే ప్రారంభించాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.