సిద్దిపేట, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హుస్నాబాద్; ‘2014కు ముందు ఎట్లుండే హుస్నాబాద్.. ఇవ్వాళ ఎట్లయ్యింది. తెలంగాణ రాకముందు పరిస్థితులు ఎలా ఉండెనో ప్రజలు ఒకసారి గుర్తు చేసుకోవాలి’.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో రూ.33.50 కోట్ల అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం డిపో గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశ్వీరాద సభకు హాజరై మాట్లాడారు. ఒకప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గం తీవ్ర దుర్భిక్ష, కరువు ప్రాంతమన్నారు. ఇప్పుడు కరువును పూర్తిగా తరిమేస్తున్నామన్నారు. ఈ సెగ్మెంట్లోని ఆరు మండలాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 900 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున రైతుబీమా పరిహారం అందించామన్నారు. హుస్నాబాద్ను రెవెన్యూ డివిజన్గా, తండాలను జీపీలుగా మార్చినట్లు తెలిపారు.
డప్పు చప్పుళ్ల హోరు.. కళాకారుల బృందం నృత్యాలు.. జై కేసీఆర్.. జై కేటీఆర్ అన్న నినాదాలు వెరసి హుస్నాబాద్ మార్మోగింది. పిల్లలు మొదలుకుని పండుటాకుల వరకు సభకు తరలిరావడంతో పట్టణం జన సంద్రాన్ని తలపించింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం సందడి చేశారు. ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. అనంతరం స్థానిక డిపో గ్రౌండ్ వద్ద నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేటీఆర్ పాల్గొని తనదైన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. సుమారు 50 వేల మందికి పైగా జనం తరలిరావడంతో డిపో గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. స్థలాభావం కారణంగా మరికొంత మంది సభా ప్రాంగణం బయటే ఉండాల్సి వచ్చింది. బహిరంగ సభ సందర్భంగా పట్టణమంతా గులాబీమయమైంది. ఈ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఉన్న అభిమానం కొట్టొచ్చినట్లు కనిపించింది. అందుకే వేలాది జనం యువనేత కేటీఆర్ సభకు తరలివచ్చారంటూ పలువురు చెప్పుకోవడం వినిపించింది.
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్…
హుస్నాబాద్ పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభ విజయవంతమైంది. ఊహించని దానికంటే ఎక్కువ సంఖ్యలో జనం రావడం బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. ఇతర మండలాల నుంచి వాహనాల్లో జనం తరలి రావడంతో పట్టణం గులాబీమయమైంది. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రహదారుల్లో గులాబీ ఫ్లెక్సీలు, కటౌట్లు ఆకట్టుకున్నాయి.
మంత్రి కేటీఆర్ పర్యటన సాగిందిలా..
హుస్నాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్తో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక బస్డిపో గ్రౌండ్లో ప్రజా ఆశ్వీరాద సభకు ప్రత్యేక బస్సులో చేరుకున్నారు.