గజ్వేల్/ తూప్రాన్, ఫిబ్రవరి 25: ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్ర ఆదివారం సాయంత్రం తూప్రాన్ చేరుకుంది. పట్టణంలో నిర్వహించిన రోడ్షోలో పాల్గొన్న కిషన్రెడ్డి మాట్లాడుతూ నాయకుడు లేని పార్టీ కాంగ్రెస్ అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి గడపడం ఖాయమని జోస్యం చెప్పారు.
ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక ఆ పార్టీ నాయకులు గత ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని, హామీలు ఇచ్చే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. అనంతరం నాచగిరి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని నాచారం మీదుగా గజ్వేల్ వెళ్లారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, పార్లమెంట్ కన్వీనర్ రామ్మోహన్ గౌడ్, సాయిబాబా గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
‘కాంగ్రెస్ అంటేనే అవినీతి, దోపిడీ ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రూ.12లక్షల కోట్ల అవినీతి జరిగింది’. అని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఆదివారం రాత్రి గజ్వేల్ పట్టణం ఇందిరాపార్కు చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సోనియాగాంధీతో పాటు మాజీ ముఖ్యమంత్రులు బెయిల్పైనే బయట ఉన్నారని, కాంగ్రెస్ నాయకులు కోర్టుల చుట్టూ తిరగడానికే పరిమితమవుతున్నారని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీకి ప్రస్తుతం 40సీట్లు ఉన్నాయని, రాబోయే ఎన్నికల్లో ఇంకా తగ్గుతాయన్నారు.
చావుతప్పి కన్నులొట్టపోయినట్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలిచేది లేదు సచ్చేది లేదన్నారు. డబ్బు, కులాన్ని చూసి ఓటు వేయకుండా మీకోసం, దేశాభివృద్ధి కోసం నిజాయితీగా అవినీతికి తావు లేకుండా ఓటు వేయాలని ప్రజలను కోరారు. నరేంద్రమోదీ హయాంలో ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదన్నారు. వచ్చే 25 సంవత్సరాల్లో ప్రపంచానికి పోటీగా భారత్ అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్బాబు, మాజీ ఎమ్మెల్యే రఘునందన్రావు, నాయకులు రాణిరుద్రమ, ఆకుల రాజయ్య, మహేశ్, సురేశ్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.