సిద్దిపేట జిల్లా ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. చుక్చుక్ రైలు బండి రానే వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, మంత్రి హరీశ్రావు కష్టంతో రైలు సౌకర్యం అందుబాటులోకి రావడంతో జిల్లా ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తల సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నాపెద్దా అనే తేడాలేకుండా రైలు వద్ద సెల్ఫీలు దిగి సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం సిద్దిపేట రైల్వేస్టేషన్లో ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట- సికింద్రాబాద్ (కాచిగూడ)కు రైలును మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డితో కలిసి ప్రారంభించారు. పూలు చల్లుతూ, స్వీట్లు పంచుతూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు అనుకూలంగా జనం పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రజలు, కార్యకర్తల మధ్యనే మంత్రి తన సంతోషాన్ని పంచుకున్నారు. సరిగ్గా 4.20 గంటలకు సిద్దిపేట రైల్వేస్టేషన్ నుంచి దుద్దెడ వరకు రైలులో ప్రజాప్రతినిధులు ప్రయాణించారు. కాగా, ప్రారంభ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రొటోకాల్ పాటించక పోవడం, బీజేపీ నాయకులు అత్యుత్సాహం చూపడంతో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు.
సిద్దిపేట ప్రతినిధి/ సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : సిద్దిపేట జిల్లా ప్రజల కల సాకారమైంది. చుక్ చుక్ రైలు బండి రానే వచ్చింది. దశాబ్దాల కల సాకారం కావడంతో ప్రజల సంతోషాలకు అవధులు లేకుండా పోయాయి. దీంతో వేలాదిగా తరలివచ్చిన ప్రజలు.. బీఆర్ఎస్ కార్యకర్తల సంబురాల మధ్యన రైలును మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కడవేర్గు మంజులారాజనర్సుతో కలిసి సిద్దిపేట రైల్వేస్టేషన్లో మధ్యాహ్నం 3 గంటలకు సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ (కాచిగూడ)కు రైలును ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రారంభించారు. సరిగ్గా 4.20 గంటలకు సిద్దిపేట రైల్వే స్టేషన్ నుంచి దుద్దెడ వరకు రైలులో ప్రయాణించారు. సిద్దిపేట రైల్వేస్టేషన్లో ప్రజలు, కార్యకర్తల మధ్యనే మంత్రి తన సంతోషాన్ని పంచుకున్నారు. మన కలలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని చెప్పారు. పూలు చల్లుతూ, స్వీట్లు పంచుతూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు నినాదాలు చేశారు.
సిద్దిపేటకు రైలు రావడం గొప్ప వరం
సిద్దిపేట జిల్లాకు రైలు రావడం గొప్ప వరమని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. నీళ్లు, నిధులు, జిల్లా ఈ కలలను నిజం చేసింది సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణను పట్టించుకోలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్దిపేటకి రైలు తెస్తామని ప్రతి పక్ష పార్టీలు చెప్పాయన్నారు. ఎన్నికలు పూర్తి కాగానే వాటిని మర్చిపోయాయన్నారు. 2006 రైల్వేలైన్ మంజూరైందని.. 33 శాతం రాష్ట్ర వాటా చెల్లించాలని కేంద్రం చెప్పిందన్నారు. సీఎం కేసీఆర్ రైల్వే లైన్ని స్వయంగా రూపకల్పన చేశారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారారు కానీ రైల్వేలైన్ రాలేదన్నారు. ప్రజల అదృష్టం తెలంగాణ రావడం, సీఎం కేసీఆర్ కావడం వల్లనే ఇవాళ రైలు వచ్చిందన్నారు. ఆనాడు కేంద్ర మంత్రిగా కేసీఆర్ ఉన్నారు..ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించిందన్నారు.
సిద్దిపేట, మెదక్, కరీంనగర్ పై ఆనాటి ప్రభుత్వాలు కక్షకట్టాయన్నారు. బీజేపీ వాళ్లు రైలు మా వల్లనే వచ్చిందని చెబుతున్నారు ఇది సిగ్గుచేటన్నారు. 33 శాతం వాటా కడితే కనీసం సీఎం ఫొటో కూడా పెట్టలేదన్నారు. 2,508 ఎకరాల భూ సేకరణ కోసం 310 కోట్లు చెల్లించింది తెలంగాణ ప్రభుత్వమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 330 కోట్లు ఇచ్చామన్నారు. ఇది చూస్తుంటే సొమ్ము ఒకడిది సోకు మరొకరిది అన్నట్లు ఉందన్నారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఏమీ చేసిందని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. సిద్దిపేట రైల్వేలైన్ కోసం కష్టపడ్డది మేము…డబ్బులు ఇచ్చింది మేము..ఈ విజయం తెలంగాణ ప్రజలదన్నారు. ఆనాడు తొమ్మి దేంద్లు కాంగ్రెస్ మోసం చేసింది…ఈనాడు బీజేపీ అబద్ధాలు ఆడుతుందని మండి పడ్డా రు. కేసీఆర్ లేకపోతే రైల్వే లైన్ లేదన్నారు.
సందడిగా సిద్దిపేట రైల్వే స్టేషన్
ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న సిద్దిపేట ప్రాంత వాసుల కల నెరవేరింది. రైలును చూసేందుకు చాలా మంది ప్రజలు రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. దీంతో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. కుటుంబ సమేతంగా వచ్చి రైలును చూసి ఆనందం వ్యక్తం చేశారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా రైలు వద్ద సెల్ఫీలు దిగి, స్టేటస్లు పెట్టుకుంటూ సంతోషంగా గడిపారు. సిద్దిపేట పట్టణం నుంచే కాకుండా సిద్దిపేట జిల్లా నలుమూలల నుంచి రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలు వచ్చారు. కొంత మంది మొదటి రోజే సికింద్రాబాద్ వరకు రైలులో ప్రయాణం చేసి కొత్త అనుభూతిని పొందారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పూలు చల్లి.. స్వీట్లు పంచుకున్నారు. ఓ వైపు పెద్ద ఎత్తున జన సందోహం రావడంతో మంత్రి హరీశ్రావు చాలాసేపు ఉత్సాహంగా రైల్వేస్టేషన్లో గడిపి.. అనంతరం దుద్దెడ రైల్వే స్టేషన్ వరకు రైలులో ప్రయాణించారు.
మొదటి రోజే ప్రయాణించడం గొప్ప అనుభూతి
మొదటిసారి సిద్దిపేట నుంచి రైలులో ప్రయాణించడం గొప్ప అనుభూతి కలిగింది. హైదరాబాద్లో ఉన్న మా కుమారుడి వద్దకు వెళ్తున్నాం. ఇది జీవితంలో గుర్తుండిపోయే రోజు. ఇంత మంచి సౌకర్యం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావులకు ప్రత్యేక ధన్యవాదాలు.
– దుర్శేటి సిద్ధేశ్వర్-లక్ష్మీనర్సవ్వ, సిద్దిపేట
చాలా సంతోషంగా ఉంది
గ్రామానికి రైలు రావడం చాలా సంతోషంగా ఉన్నది. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న రైలు నేడు రావడం చాలా ఆశ్చర్యం కలిగింది. ఆర్థిక, వైద్యా రోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు నిరంతర కృషి వల్లనే ఇది సాధ్యమైంది. ఇక నుంచి సికింద్రాబాద్ వెళ్లేందుకు ఎంతో సులువుగా ఉంటుంది. ఇందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక ధన్యవాదాలు..
– రాజబోయిన సంతోష్కుమార్, నర్సాపూర్
ఇది చారిత్రాత్మక దినం
సిద్దిపేటకు రైలు రావడం చారిత్రాత్మక దినం. చాలా ప్రభుత్వాలను చూశా. కానీ ఇంత త్వరగా భూసేకరణ చేసి.. రైల్వేలైన్ పనులను దగ్గరుండి పర్యవేక్షించి మా కలను నిజం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి, మంత్రి హరీశ్రావుకు రుణపడి ఉంటాం. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ఏదైనా అనుకుంటే తప్పకుండా చేసి తీరుతారు. సిద్దిపేట నుంచి హైదరాబాద్, బెంగళూరుకు ఇంకా చాలా ప్రదేశాలు వెళ్లేందుకు మాకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
– గడ్డం రాజేశంగౌడ్, అల్లీపూర్, చిన్నకోడూరు మండలం
సిద్దిపేటకు వస్తుందనుకోలేదు
మా పొలం సిద్దిపేట రైల్వే స్టేషన్కు చాలా దగ్గరలో ఉంటుంది. ఇంత తొందరగా రైల్వేలైన్ పూర్తయి రైలు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఈరోజు సిద్దిపేట నుంచి హైదరాబాద్ పో యేందుకు రైలు ప్రారంభకావడం ఎంతో సంతోషంగా ఉంది. నిజంగా రైలులో తిరుగుతుంటే ఇది కలా.. నిజమా అన్నట్లుగా ఉంది.
– తాళ్ల కవిత, లింగారెడ్డిపల్లి
రైలును చూస్తామనుకోలేదు..
మాకు డబుల్ బెడ్ రూం ఇల్లు వచ్చింది. ఇప్పుడు మా ఇండ్ల వద్దకే రైలు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కన్నో హైదరాబాద్ లాంటి నగరాల్లో రైలును చూసేది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు కృషివల్ల సిద్దిపేటకు రైలు వచ్చింది. రైలు ప్రారంభమైతుందని తెలిసి మా బ్లాక్లో ఉన్న అందరం రైలును చూసేందుకు వ చ్చాం. నిజంగా ఇక్కడికి వచ్చి చూస్తే ఎంతో సంతోషమనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– అక్కాల లత, కేసీఆర్ నగర్
మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు
మంత్రి హరీశ్రావు సహకారంతో డబుల్ బెడ్ రూం ఇల్లు వచ్చింది. సిద్దిపేటకు రైలు వచ్చిందని అసలు నమ్మలేకపోతున్నాం. చాలా ఏండ్ల నుంచి సిద్దిపేటకు రైలు వస్తుందని ఎదురు చూశాం. కానీ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు సార్లతోనే ఇది సాధ్యమైంది. మా కు ఇంత మంచి సౌకర్యం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉంటాం.
– కానోజు లలిత, కేసీఆర్ నగర్